విశాఖలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు. విశాఖ అద్భుతమైన ప్రాంతమని.. మంచి వనరులు ఉన్నాయన్నారు. సబ్సీ కేబుల్ కూడా ఈ ప్రాంతంలోనే ఏర్పాటు అవుతుందని చెప్పారు.
ఆర్టీసీలో రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు అనుగుణంగా బస్సు రూట్ లు పెంచేలా స్టడీ చేయాలన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామంలో కుక్కలు బీభత్సం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న జ్యోతి, జనార్దన్ దంపతుల కొడుకు రిత్విక్ అనే బాలుడిపై వీధి కుక్కలు దాడిచేశాయి. రిత్విక్ ఎడమ కన్నుపై తీవ్రగాయంకాగా.. చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని సరోజినీదేవి కంటి ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. బాలుడి కంటి చూపు పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
హైదరాబాద్ కూకట్పల్లిలోని భాగ్యనగర్లో వైన్షాపుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు మహిళలు. తమ కాలనీలో వైన్ షాపులు వద్దంటూ రోడ్డెక్కారు. నడిరోడ్డుపై టెంట్ వేసి ధర్నా చేపట్టారు. వైన్ షాపు వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు మహిళలు.
మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో నల్ల పోచమ్మ గుళ్లో అపచారం చోటుచేసుకుంది. నల్లపోచమ్మ గుడిలో అర్ధరాత్రి దొంగలు తాళాలు పగలగొట్టారు. అమ్మవారి చీరలు, హుండీ డబ్బులు ఎత్తుకెళ్లారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఉద్యోగాల పేరుతో సుధారెడ్డి అనే లాయర్ దాదాపు 3 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడింది. టీటీడీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 200 మంది నుంచి డబ్బు వసూలు చేసింది. ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి 3 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు.
8 నెలల నుంచి తమకు బిల్లులు చెల్లించడం లేదంటూ పాడి రైతులు యాదాద్రి భువనగిరి నార్మల్ మదర్ డైరీ పాల శీతలీకరణ కేంద్రం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారిపై బైఠాయించటంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సుమారు 120 మంది రైతులకు 24 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని రైతులు చెబుతున్నారు.
ఢిల్లీ బ్లాస్ట్ కేసులో మొత్తం మూడు కార్లు ఇన్వాల్వ్ అయినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మూడో కారు మారుతీ బ్రెజా కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఆ కారును.. రెక్కీతో పాటు ఎస్కేప్ కోసం ఉపయోగించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. పాత హౌసింగ్ బోర్డ్ కాలనీలో డాక్టర్ విజయ్ కుమార్ ఇంట్లో చొరబడి 15 తులాల వెండి, రెండు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. బాధితుడు గద్వాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని కర్నూలు జిల్లా చిన్నవంగలి గ్రామానికి చెందిన యేమిరెడ్డి హరిప్రసాద్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా దొనకొండలో బైక్లు, గొర్రెల దొంగతనాలకు పాల్పడిన 8 మంది వ్యక్తులను ఎస్సై త్యాగరాజు అరెస్టు చేశారు. దొనకొండలోని అడ్డరోడ్డు వద్ద వారు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర మైనింగ్ కార్యాలయం వద్ద గుంటూరు జిల్లా కార్మికులు ఆందోళన చేపట్టారు. పివిఆర్ అనే వ్యక్తి తమ క్వారీ లీజును అడ్డుకుని, అక్రమ క్వారీయింగ్కు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మైనింగ్ మంత్రి స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం జెర్రెల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమపాఠశాలలో పుడ్ పాయిజన్తో 57 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి పెరుగు, దుంపల కూర తిన్న తరువాత వారికి కడుపు నొప్పి, వాంతులు వచ్చాయి. బాధితులను జెర్రెల ఆసుపత్రికి, మరికొందరికి ఆశ్రమ పాఠశాలలోనే చికిత్స అందిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో దొంగలు హల్చల్ చేశారు. ఓ మొబైల్ షాప్ నిర్వాహకుడిపై దాడి చేశారు. కళ్ళల్లో కారం చల్లి దొంగతనానికి యత్నించారు. గుర్తించిన నిర్వాహకుడు వారిని అడ్డుకొని.. వెంటనేపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
నిర్మల్ జిల్లా సుభాష్నగర్ కాలనీ వద్ద గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గాంధీనగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ పుట్ట మనోహర్, సుభాష్నగర్ కాలనీకి చెందిన భోదాసు రాము అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తుండగా.. వారిని అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి మూడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని.. రిమాండ్కు తరలించిన్నట్లు వెల్లడించారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటన పలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. హైగ్రేడ్ పేలుడు పదార్థాలు వాడినట్లు ఫోరెన్సిక్ నివేదిక తెలిపింది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై, 300 మీటర్ల దూరంలో కూడా శరీర భాగాలు దొరికాయి. ఓ దుకాణం పైకప్పుపై మోచేతి కింది భాగం వరకు ఉన్న చేయిని అధికారులు గుర్తించి.. స్వాధీనం చేసుకున్నారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణమూర్తి సతీమణి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఓ వివాహ వేడుకలో డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచారు. డోలు చప్పుళ్లకు ఉల్లాసంగా స్టెప్పులేస్తున్న వారి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ పెళ్లి వేడుకల్లో భాగంగా సుధామూర్తి స్టెప్పులేశారు.
తను రాసిన పెద్ది సినిమాలోని చికిరి చికిరి పాట గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు లిరిసిస్ట్ బాలాజీ. సిటీమార్, ఎంసీఏ పాటలకంటే నా కెరీర్లో ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్ వచ్చిన పాట ఇదేనని తెలిపారు. ఒక్క రోజులోనే మిలియన్ల వీక్షణలతో సరికొత్త రికార్డ్ సాధించింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును క్షమించాలంటూ ఆదేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. నెతన్యాహుపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నెతన్యాహుకు మద్దతుగా ట్రంప్ లేఖ రాశారు.
ఐపీఎల్ 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్గా మాజీ ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ నియమితులయ్యారు. గతంలో DCకి కోచ్గా పని చేసిన వాట్సన్.. అభిషేక్ నాయర్, డ్వేన్ బ్రావోతో కలిసి పనిచేయనున్నారు. జట్టుకు మరో టైటిల్ తీసుకురావడానికి కృషి చేస్తానని వాట్సన్ తెలిపారు.