జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేటీఆర్, హరీష్ రావులే కారణమంటూ విమర్శించారు. పేరుకే కృష్ణార్జునులు తప్ప అక్కడ ఏం లేదంటూ ఎద్దేవా చేశారు.
సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్సైట్నే హ్యాక్ చేశారు. దీంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సైట్ను రిస్టోర్ చేసిన ఎన్ఐసీ అధికారులు.. విదేశీ గేమింగ్ యాప్లపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కేసముద్రం స్టేషన్ నుంచి అమీనాపురం వైపునకు వెళ్లేందుకు ఆగి ఉన్న గూడ్స్ రైలు కింద నుంచి వ్యక్తి పట్టాలు దాటుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది. కానీ ఆ వ్యక్తి ఏ మాత్రం కంగారు పడకుండా రైలు పట్టాలపై బోర్ల పడుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు.
సంగారెడ్డి జిల్లా కోహీర్లోని బడంపేటలో దారుణం చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నతల్లిని హత్య చేశాడు కుమారుడు. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి గోప్యమ్మను కుమారుడు బాలరాజు తలపై గొడ్డలితో కొట్టి హతమార్చాడు. గోప్యమ్మ అరుపులు వేయడంతో అక్కడ నుంచి బాలరాజు పరారయ్యాడు.
హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా సీపీ ప్రజలను హెచ్చరించారు. అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్లు లేదా డబ్బులు పంపమని వచ్చే సందేశాలను అంగీకరించవద్దని సూచించారు. ఏదైనా మెసేజ్ వస్తే ఆ వ్యక్తిని స్వయంగా ఫోన్లో సంప్రదించి ధ్రువీకరించుకోవాలని తెలిపారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట గ్రామ సచివాలయంలో వైసీపీ నాయకుడు హల్చల్ చేశాడు. ఉద్యోగి సీట్లో నాదెండ్ల మండలం వైసీపీ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి కూర్చోవడం స్థానికంగా చర్చనీయాంశం మారింది. అయితే సచివాలయానికి వెళ్లిన శంకరరావు.. సిబ్బంది కూర్చోవలసిన చోట ఇతర వ్యక్తులు కూర్చునేందుకు ఎలా అనుమతించారంటూ ప్రశ్నించాడు. కుర్చీ ఖాళీగా ఉంటే కూర్చున్నానని సమాధానం ఇచ్చాడు కోటిరెడ్డి.
గన్నవరం ఎయిర్పోర్టులో ఇండిగో సింగపూర్ విమాన సర్వీస్ను పునఃప్రారంభించారు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దీంతో కూటమి ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో రద్దయిన ఈ సర్వీసును కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మళ్లీ ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
హైదరాబాద్ గోల్నాకలో బిగ్ టీవీ ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించింది. సీజన్స్ ఆస్పత్రి సౌజన్యంతో ఈ క్యాంప్ను నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి బస్తీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వాతావరణ మార్పుతో సీజనల్ వ్యాధులు వస్తున్నాయని ఆస్పత్రి వైద్యులు చెప్పారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరులోని సదాశివపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మేర్లపాలెంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు పూరిళ్లు దగ్ధమవగా.. దాదాపు లక్షా 50వేల రూపాయలు బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సుమారు 6లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లోని పీవీ నరసింహారావు ఫ్లైఓవర్పై శంషాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు బోల్తా పడింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, ఒక చిన్నారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిజామాబాద్లో బీఎంబీ కంపెనీ ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉందని ఏజెంట్లు ప్రచారం చేయడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అధిక లాభాల ఆశతో 2 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు. తాజాగా కంపెనీ ప్రతినిధులు బోర్డు ఎత్తేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చిన కథనం ఫేక్ అన్నారు కోస్గి తహశీల్దార్ శ్రీనివాస్. రేకులకుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని క్లారిటీ ఇచ్చారు. చెరువు ఆక్రమణ అంటూ వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమన్నారు. కావాలనే రెవెన్యూ అధికారులపై నిందలు మోపుతున్నారంటూ మండి పడ్డారు.
హైదరాబాద్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని STFB పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 4.495 కేజీల గంజాయి, 3సెల్ఫోన్లు, కారు సీజ్ చేశారు. వెంకట చైతన్య, మమత దంపతులు పెద్ద అంబర్పేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందిన సంఘటన నిజామాబాద్లోని అర్సపల్లి ఆటో స్టాండ్ వద్ద జరిగింది. పిల్లల కోసం వెళ్లిన బస్సును రివర్స్ తీసుకునే క్రమంలో క్లీనర్పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జమ్మూకశ్మీర్ ఫరీదాబాద్లో జరిగిన భారీ పేలుడు ఘటన దురదృష్టకరమని డీజీపీ నలిన్ ప్రభాత్ అన్నారు. ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దని, అది ఉగ్ర కుట్ర కాదు… ప్రమాదమేనని చెప్పుకొచ్చారు. నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచామని.. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోందని అన్నారు.
బిహార్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి పాఠమని సీఎం స్టాలిన్ తెలిపారు. నిర్ణయాత్మక విజయం సాధించిన సీఎం నీతీశ్కుమార్కు ఆయన అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో విజయం కోసం అవిశ్రాంతంగా పోరాడిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్కు కూడా శుభాకాంక్షలు చెప్పారు.
ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్, CSK మధ్య స్వాప్ ట్రేడ్ డీల్ జరిగింది. రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్ను CSK తీసుకుంది. దీనికి బదులుగా CSK స్టార్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్లను రాజస్తాన్కు పంపింది. CSK సోషల్ మీడియాలో ఈ డీల్ను ధ్రువీకరించింది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ఈరోజు ఎంతో ప్రత్యేకం. టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి 2023 నవంబర్ 15న వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్పై తన 50వ వన్డే సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనతతో అతను సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడు.
జీవితంలో తప్పులు, వైఫల్యాల ప్రాధాన్యం గురించి బాలీవుడ్ కథానాయిక సోనాక్షి సిన్హా మాట్లాడింది. మీకు అన్నీ తెలుసని అనుకున్న రోజు, అదే ముగింపు అవుతుందని అన్నారు. తప్పులు చేయడం ద్వారానే కొత్త విషయాలు నేర్చుకుంటామని చెప్పారు. తప్పులకు భయపడవద్దని, వాటిని ఒక అభ్యాస ప్రక్రియగా భావించాలని తెలిపారు.