ఐ బొమ్మ, బప్పం వెబ్ సైట్స్ బ్లాక్ చేయించారు సైబర్ క్రైమ్ పోలీసులు. సవాల్ విసిరిన ఇమ్మడి రవితోనే వెబ్ సైట్స్ మూసివేయించారు. వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్స్ మూసేశారు. రవి వద్ద సీజ్ చేసిన హార్డ్ డిస్క్లను విశ్లేషిస్తున్నారు. కస్టడీ కోసం రేపు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలను ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్టు చేశారు. తక్కువ ఆదాయ వృద్ధి, తక్కువ మూలధన పెట్టుబడి.. పెరిగిపోతున్న రుణభారం అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకరకరంగా మారిందంటూ పోస్ట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని సతీ సమేతంగా ఫ్రాన్స్ దేశానికి చెందిన భారతదేశపు రాయబారి థియర్ మాథౌ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన వారికి అల్లు వెంకట దుర్గాభవాని ఆలయ ఈవో మర్యాదలతో స్వాగతం పలికారు.
సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు.. పైలాన్ ఆవిష్కరించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 92.5 కోట్ల నిధులకు సంబంధించిన పనులను ప్రారంభించారు. చరిత్ర సృష్టించాలన్న, తిరగరాయాలన్న నందమూరి కుటుంబానికే సాధ్యమన్నారు. తనను మూడుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలకు.. నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లోని న్యూ క్లాసిక్ గార్డెన్లో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా కాసాల గ్రామానికి చెందిన మైనర్ బాలిక వివాహాన్ని సాదుల్ నగర్ యువకుడితో జరిపిస్తుండగా ఆపారు. అనంతరం ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు.
ములుగు జిల్లాలో 45 లక్షల నిధులతో గట్టమ్మగుడి వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. మేడారం భక్తుల సౌకర్యార్థం ఈ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ సహకారంతో ములుగును అభివృద్ధి చేస్తున్నామని ఆమె వివరించారు.
విశాఖపట్నం VMRDA కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవీఎంసీతో పాటు VMRDA పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. VMRDA చేపట్టిన MIG లేఅవుట్లు, మౌలిక వసతుల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.
అల్లూరి జిల్లా అరకులోయ మేఘాలకొండను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. దట్టంగా కురుస్తున్న మంచులో పర్యాటకులు ఆహ్లాదం ఆనందాన్ని పొందారు. ఈ వాతావరణం అద్భుతమైన అనుభూతిని కలిగించిందని పర్యాటకులు తెలిపారు.
గుంటూరు శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణంలో నిబంధనలు పాటించడం లేదంటూ టాక్స్ ప్లేయర్స్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ కమిషనర్ నిర్మాణ పనులను పరిశీలించారు. వంతెన అభివృద్ధిని కొందరు కావాలనే అడ్డుకుంటున్నారని మేయర్ రవీంద్ర ఆరోపించారు.
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దారుణం జరిగింది. ఇందిరా కాలనీకి చెందిన 19 ఏళ్ల ఉప్పుతోళ్ల శ్రీనివాస్ అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు.. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ గోల్డ్ డ్రాప్ ఆయిల్ లోడుతో హైదరాబాద్ నుంచి తాండూర్ వెళ్తున్న క్రమంలో అనంతగిరి గుట్ట కేరెల్లి మలుపు వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఘటనా స్థలంలో నూనె డబ్బాల కోసం జనం ఎగబడ్డారు.
మియాపూర్ హఫీజ్ పేట్లోని రుమాఆన్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా కిచెన్లో మంటలు చెలరేగాయి. యాజమాన్యం అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి గంజాయి చాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. నరసరావుపేట నుంచి వినుకొండ వస్తున్న ప్రశాంతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో.. వినుకొండ దగ్గర గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
పరకామణి కేసును రాజీ చేయడానికి సవాల్ చేస్తూ మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు రీఓపెన్ చేశారు. పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి చెందడంతో కలత చెందిన శ్రీనివాసులు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలంటూ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. చింతగుఫా పోలీస్స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది.
బిహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు చర్యలు చేపట్టారు. మరోసారి సీఎంగా నీతీశ్ కుమార్ కొనసాగుతారని కూటమి వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 19 లేదా 20 తేదీలలో కొత్త ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. ఇందుకు పట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ కారు పేలుడు ఘటన తర్వాత దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్లో సోదాలు చేస్తున్నారు కౌంటర్–ఇంటెలిజెన్స్ కశ్మీర్, జమ్మూకశ్మీర్ స్పెషల్ సెల్ పోలీసులు. హర్యానాలో మరో డాక్టర్ ప్రియాంక శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె మొబైల్ను స్వాధీనం చేసుకుని కాల్ రికార్డ్స్, డేటా ఆధారంగా విచారణ చేస్తున్నారు.
వారణాసి కథ, అందులోని పాత్రకు మహేశ్ బాబు అర్హుడని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. ఐదు నిమిషాల పాటు తన పాత్ర గురించి చెప్పగానే తాను ఓకే చెప్పానని తెలిపారు. ఆ తర్వాత మూడు గంటల సేపు ఆయన కథ చెప్పిన విధానానికి ఫిదా అయిపోయానని అన్నారు.
మెక్సికోలో మేయర్ దారుణ హత్య, పెరుగుతున్న హింసపై జెన్-జెడ్ నిరసనలకు దిగింది. వారి నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనకారులు అధ్యక్ష భవనం ముట్టడికి ప్రయత్నించగా.. దాదాపు 100 మంది పోలీసులు, 20 మంది పౌరులు గాయపడ్డారు. వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కోల్కతా.. ఈడెన్ గార్డెన్స్ పిచ్పై విమర్శలు రావడంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించారు. టీమిండియా మేనేజ్మెంట్ కోరిన విధంగానే పిచ్ను తయారు చేసుంటారన్నారు. మ్యాచ్కు ముందు నాలుగు రోజులు వాటరింగ్ చేయకపోవడమే దీనికి కారణమని చెప్పిన క్యురేటర్ను తప్పు పట్టలేమని తెలిపారు.