కోడలిని హత్య చేసిన కేసులో కామారెడ్డి జిల్లా సంచలన తీర్పు ఇచ్చింది. కోడలు కీర్తన మరణానికి కారణమైన అత్త కూరాటి అంబవ్వకు జీవిత ఖైదు విధించింది. 2022లో జరిగిన ఈ ఘటనపై తాజాగా విచారణ పూర్తైంది. దీంతో అత్తకు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. 10వేల రూపాయల జరిమానా సైతం విధించింది. అంబవ్వకు కోర్టు విధించిన శిక్ష జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది.
సిద్దిపేట జిల్లాలో కొన్ని పరిశ్రమలు కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. నిబంధనలకు పాతరేస్తూ భూ, జల, వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాయి. తిమ్మపూర్ శివారులోని ఓ పాడి పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం సమీపంలోని పొలాలు, రైతులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆ నీటితో సాగు చేస్తుండడంతో రైతులకు వ్యాధులు వస్తున్నాయి.
నాడు పెట్టుబడిదారులతో దోచుకుంది ఎవరో కేటీఆర్ చెప్పాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డిది ఫామ్హౌజ్ పాలన కాదన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టమొచ్చినట్లు జోవోలు పాస్ చేశారని మండి పడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై ఆరోపణలు చేయడం ఇకపై మానుకోవాలన్నారు. కేసీఆర్ కుటుంబంలో పదవులు ఎవరు అనుభవించారో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు ఎంపీ చామల.
ఈ నెల 25న తెలంగాణ కాబినేట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. డెడికేషన్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది కేబినేట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణపై చర్చించనుంది కేబినేట్. ఆపై స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాలపైనా చర్చించనున్నారు. ఇక యాదగిరి గుట్ట దేవస్థానం బోర్డుకు సైతం ఆమోదం తెలపనుంది తెలంగాణ కేబినేట్.
హిడ్మా ఎన్కౌంటర్ బూటకమంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిడ్మా, హిడ్మా భార్య రాజేతో పాటు కొంత మందిని విజయవాడలో నవంబర్ 15న నిరాయుధులగా మార్చి క్రూరంగా హతమార్చారని లేఖలో ఆరోపించారు. ఈ క్రూర హత్యాకాండకు వ్యతిరేకంగా నవంబర్ 23న దేశ వ్యాప్త నిరసనకు పిలుపునిస్తూ అభయ్ పేరిట లేఖను విడుదల చేశారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్ధిని మధ్యాహ్న భోజనానికి వెళ్ళి తిరిగి రాకపోవడంతో తోటి విద్యార్థులు క్లాస్ రూం వద్ద చూశారు. ఆమె చున్నీతో ఉరి వేసుకొని ఉన్నట్లు గుర్తించి అరిచారు. ఉపాధ్యాయులు వెంటనే క్లాస్ రూంకి చేరి ఆమెను కిందకు దింపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్ష చేసినప్పుడు విద్యార్థిని అప్పటికే మృతి చెందారని తెలిపారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .
తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. సీఎస్ రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ డీజీగా జయేంద్ర సింగ్ చౌహాన్, సీఐడీ డీజీగా పరిమళ నూతన్ జాకబ్, పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్ మైలబత్తుల పలువురి అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం.
హైదరాబాద్ ఆల్వాల్లో ఘరానా మోసం వెలుగు చూసింది. అత్త మామలు బత్రికుండగానే.. చనిపోయారని అధికారులను నమ్మించి వారు ఆస్తులను కాజేసింది. సైనిక్పురికి చెందిన దాసరి లక్ష్మి ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ సర్టిఫికేట్స్ సృష్టించింది. వారి పేరు మీద ఉన్న ఆస్తులను వేరే వారికి విక్రయించింది. దీనిపై వృద్ధులు ఆల్వాల్ ఎమ్మార్వోను ఆశ్రయించడంతో మోసం బయటపడింది. లక్ష్మిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో.
టమాటా ధరలు భారీగా పెరిగాయి. గత వారం కిలో 10 రూపాయలు పలికిన టమాటా.. ఇప్పుడు ఏకంగా 50 రూపాయలు దాటింది. దీంతో మొన్నటి వరకు గిట్టుబాటు ధర లేక నష్టపోయిన రైతులకు ఇప్పుడు కొంత ఉపశమనం లభించింది. అయితే టమాట ధరలు పెరగడానికి కారణం ఉత్పత్తి తగ్గడమే.
పోలవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ తీరు, పురోగతిని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి పోలవరం చేరుకుంది. ప్రాజెక్టులో కీలక నిర్మాణాలైన డయాఫ్రమ్ వాల్, గ్యాప్-1, గ్యాప్-2 , ECRF నిర్మాణాలను క్షుణ్ణంగా పరిశీలించనుంది. ప్రాజెక్టు నాణ్యత, నిర్మాణం వేగంపై ఈ బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్నగర్ ఎంపీపీఎస్ ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు పడింది. విధులలో నిర్లక్ష్యం వహించినందుకు జగన్మోహన్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈవో రంగనాయుడు చర్యలు తీసుకున్నారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు డీఈవో.
జగిత్యాల జిల్లా పొలాసలో షార్ట్ సర్క్యూట్ కారణంగా హర్వెస్టర్ పూర్తిగా దగ్ధమైంది. అరవింద్కు చెందిన రెండెకరాల వరిపంట కోస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. డ్రైవర్ గమనించి దూకడంతో ప్రాణాపాయం తప్పింది. వడ్లతోపాటు యంత్రం కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
అమరావతి లిక్కర్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ కోసం లేఖ రాశారు ఎమ్మెల్సీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లేఖలో 30 ఏళ్లుగా స్థిరాస్తి వ్యాపారంతోనే బతుకుతున్నానని, 100ఏళ్ల క్రితం నుంచి ఆస్తులు, 5 దశాబ్దాల ఇంటిని జప్తు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మొత్తం ఆస్తులు 8 కోట్ల అయితే 60 కోట్లుగా చూపి కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. న్యాయస్థానాలపై నమ్మకముందని, కాలమే సమాధానం చెబుతుందన్నారు చెవిరెడ్డి.
మంత్రి నారాయణ రాజధానిలోని వెంకటపాలెం, ఉద్దండ రాయునిపాలెంలో పర్యటించారు. సిటీస్ ప్రాజెక్ట్ ద్వారా చేపట్టిన అంగన్వాడీ, హెల్త్ సెంటర్లు, పాఠశాల భవనాలను ఆయన పరిశీలించారు. వీటి ద్వారా రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్యా,వైద్య సదుపాయాలు అందుతాయన్నారు మంత్రి.
రంగారెడ్డి జిల్లా కొండాపూర్లో కబ్జాకోరుల ఆగడాలకు చెక్ పెట్టింది హైడ్రా. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు.. బై నంబర్లు వేసి కొట్టేయాలని చేసే ప్రయత్నాలను అడ్డుకుంది. 4 ఎకరాల మేర పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థలాలుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. ఈ ప్రాంతంలో ఎకరం 200 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది. దీంతో హైడ్రా కాపాడిన భూమి విలువ దాదాపు 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
నంద్యాల జిల్లా కొణిదెల గ్రామంలో చాపల మహేష్ అనే రైతు పొగాకు పంట దగ్ధమైంది. నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు రైతు అనుమానిస్తున్నాడు. దాదాపు 3లక్షల నష్టం జరిగినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
దుబాయ్ ఎయిర్ షోలో విషాదం చోటుచేసుకుంది. విమాన ప్రదర్శన సమయంలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ విమానం కూలింది. దీంతో మంటలు చెలరేగి విమానం పూర్తిగా దగ్ధమైంది. విన్యాసాలు చేస్తుండగా విమానం కూలింది. మధ్యాహ్నం 2గంటల 10నిమిషాలు సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందాడు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకత్వాన్ని విమర్శిస్తూ, కొన్ని పార్టీలు చొరబాటుదారులను రక్షిస్తున్నాయని ఆరోపించారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. దేశ భద్రత, ప్రజాస్వామ్యానికి ఇది కీలకమన్నారు. ప్రతి చొరబాటుదారులను బహిష్కరిస్తామని చెప్పారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ SIRను ఆపాలని ఎక్స్కు లేఖ రాసిన నేపథ్యంలో అమిత్ షా స్పందన గమనార్హం.
యాషెస్ సిరీస్లో భాగంగా పెర్త్ వేదికగా మొదటి టెస్ట్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 172 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లకు 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో నాథన్ లయన్ (3), బ్రెండన్ డొగ్గెట్ (0) ఉన్నారు. ఆసీస్ జట్టు ఇప్పటికీ 49 పరుగుల వెనకంజలో ఉంది.
హీరోయిన్ రష్మిక మందన, హీరో దీక్షిత్ శెట్టి కలిసి నటించిన ది గర్ల్ఫ్రెండ్ చిత్రం ఇటీవలే విడుదలై పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీ తర్వాత దీక్షిత్ తన కొత్త చిత్రం బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు రష్మిక ఎంగేజ్మెంట్కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దీనిపై దీక్షిత్ స్పందిస్తూ, సహనటుల వ్యక్తిగత విషయాల్లో తాను జోక్యం చేసుకోనని స్పష్టం చేశారు.