Blood Sugar: సాధారణంగా రక్తంలో చక్కెర అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది తీపి పదార్థాలు లేదా పంచదార. అయితే.. మనం ప్రతిరోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు చక్కెర కంటే వేగంగా శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయన్నది చేదు నిజం. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండే ఈ ఆహారాలు రక్తప్రవాహంలోకి త్వరగా కలిసిపోయి. ఇన్సులిన్ అసమతుల్యతకు దారితీస్తాయి. మధుమేహం ఉన్నవారే కాకుండా.. ఆరోగ్యంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరూ చక్కెర కంటే ప్రమాదకరమైన ఆహారాల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.
చక్కెర కంటే ప్రమాదకరమైన 5 ఆహార పదార్థాలు:
మనం ఆరోగ్యకరం అని భావించే లేదా సాధారణంగా తీసుకునే కొన్ని కార్బోహైడ్రేట్లు శరీరంలోకి వెళ్ళిన తర్వాత పంచదార కంటే వేగంగా విచ్ఛిన్నం అవుతాయి.
1. వైట్ బ్రెడ్ : చాలా మంది ఉదయం అల్పాహారంగా వైట్ బ్రెడ్ తీసుకుంటారు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ సుమారు 75 ఉంటుంది. ఇది టేబుల్ షుగర్ కంటే ఎక్కువ. వైట్ బ్రెడ్ తయారీలో వాడే మైదాలో పీచు పదార్థం ఉండదు. దీని వల్ల ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరిగిపోతాయి.
2. తెల్ల బియ్యం : మన ప్రధాన ఆహారం అన్నం. అయితే, పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉండి.. పీచు పదార్థం అసలు ఉండదు. ఇది తిన్న కొద్ది సేపటికే గ్లూకోజ్గా మారి రక్తంలో కలుస్తుంది. ఒక కప్పు తెల్ల అన్నం తినడం వల్ల కలిగే గ్లూకోజ్ ప్రభావం, కొన్ని స్పూన్ల పంచదార తినడం కంటే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
3. బంగాళదుంపలు: ముఖ్యంగా ఉడికించిన లేదా వేయించిన బంగాళదుంపల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ (సుమారు 80-90). బంగాళదుంపలోని స్టార్చ్ను మన శరీరం చాలా వేగంగా జీర్ణం చేసుకుంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఫ్రైస్ లేదా చిప్స్ రూపంలో తీసుకుంటే.. ఇవి మరింత ప్రమాదకరంగా మారతాయి.
4. పండ్ల రసాలు : పండ్లు తినడం ఆరోగ్యకరం, కానీ వాటిని రసం రూపంలో తీసుకోవడం అంత మంచిది కాదు. పండ్లను రసంగా మార్చినప్పుడు అందులోని సహజ పీచు పదార్థం తొలగిపోతుంది. పండ్ల రసాల్లో ‘ఫ్రక్టోజ్’ అధికంగా ఉండటమే కాకుండా.. పీచు లేకపోవడం వల్ల అవి నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఇది బాటిల్డ్ సోడా తాగడం లాంటిదే.
Also Read: ఈ హోం రెమెడీస్తో.. పలుచటి ఐబ్రోస్కు గుడ్ బై చెప్పండి
5. కార్న్ ఫ్లేక్స్, తృణధాన్యాల సీరియల్స్ : చాలా మంది బరువు తగ్గడానికి ఉదయం పూట కార్న్ ఫ్లేక్స్ తింటారు. కానీ వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ దాదాపు 80 నుంచి 90 వరకు ఉంటుంది. ఇవి ప్రాసెస్ చేయబడిన ఆహారాలు కావడంతో.. వీటిలో చక్కెరలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వెంటనే శక్తిని ఇచ్చినట్టు అనిపించినా.. అంతే వేగంగా రక్తంలో గ్లూకోజ్ పెంచి ఆ తర్వాత నీరసం వచ్చేలా చేస్తాయి.
మనం తినే ఆహారం కేవలం రుచికరంగా ఉండటమే కాదు. అది మన శరీర జీవ క్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించాలి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్, వైట్ బ్రెడ్ బదులు.. హోల్ గ్రెయిన్ బ్రెడ్, పండ్ల రసాల కంటే నేరుగా పండ్లను తినడం ఉత్తమం. సరైన ఆహార ఎంపికలే మధుమేహం, ఇతర ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి.