Royal Enfield Production Eexpansion: ఐచర్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల తయారీకి సంబంధించి కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రస్తుతం భారత్ లో ఏడాదికి 14.6 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉండగా, ఇకపై 20 లక్షల యూనిట్లు పెంచాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి సామర్థ్య విస్తరణ ప్రణాళికను కంపెనీ బోర్డు తాజాగా ఆమోదించింది. ఇందుకోసం కంపెనీ రూ. 958 కోట్ల పెట్టుబడిని పెట్టాలని నిర్ణయించింది. ఈ విస్తరణ పనులు 2027లో ప్రారంభమై, 2028 వరకు పూర్తి కావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
ఐషర్ కంపెనీ ఇప్పటికే తమ ఉత్పత్తి సామర్థ్యం పెంపకానికి సంబంధించి BSE, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు రెగ్యులేటరీ ఫైలింగ్ ను సమర్పించింది. కంపెనీ ప్రస్తుత తయారీ సామర్థ్యం పూర్తి వినియోగానికి దగ్గరగా ఉంది. పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇక తమిళనాడు చేయ్యార్ లోని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుత తయారీ కేంద్రంలో విస్తరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈ సామర్థ్య రాంప్ అప్ దశలవారీగా అమలు చేయబడుతుందని వివరించింది. ఈ పనులు FY2027 మొదటి త్రైమాసికంలో ప్రారంభమై, FY2028 నాటికి పూర్తవుతుందని వెల్లడించింది. అదనంగా 5.4 లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యం పెరిగితే, ప్రస్తుత ఉత్పత్తి స్థాయి కంటే 37 శాతం పెరుగుదల కనిపించనుంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన మొత్తం రూ.958 కోట్ల పెట్టుబడి కోసం నిధులు సమీకరిస్తామని ప్రటించింది. ఐషర్ మోటార్స్ రుణం, ఈక్విటీ ద్వారా కాకుండా స్వంత నిల్వలు, లాభాలను ఉపయోగించనున్నది.
Read Also: MG మెజెస్టర్ To వోక్స్వ్యాగన్ టేరాన్.. ఫిబ్రవరి 2026 ట్రెండింగ్ కార్లు ఇవే!
రాయల్ ఎన్ ఫీల్డ్ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో తన మోటార్ సైకిళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ 2025లో 10,71,809 బైక్లను అమ్మింది. ఇప్పటి వరకు అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ చరిత్రలోనే తొలిసారి ఓ క్యాలెండర్ ఇయర్ లో మిలియన్ యూనిట్ మైలు రాయిని దాటింది. అదే సమయంటో కంపెనీ గత సంవత్సరం 1,32,132 మోటార్ సైకిళ్లను ఎగుమతి చేసింది. ఇదే దూకుడును కొనసాగించేందుకు కంపెనీ మరింతగా ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తోంది.
Read Also: కళ్లు చెదిరేలా టయోటా హైలాండర్ EV 2027, ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసా భయ్యా!