Natural body coolants: సమ్మర్లో శరీరం త్వరగా అలసిపోవడం, డీహైడ్రేషన్, వేడి వల్ల వచ్చే అనారోగ్యాలు సర్వసాధారణం. ఆయుర్వేదం ప్రకారం.. వేసవిలో శరీరంలో ‘పిత్త’ దోషం బాగా పెరుగుతుంది. ఇది అధిక వేడికి దారితీస్తుంది. మన వంటగదిలో ఉండే కొన్ని సహజ సిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా ఈ వేడిని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శరీరాన్ని చల్లబరిచే ఆ 6 ముఖ్యమైన ఆహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆయుర్వేదం అనేది కేవలం మందుల గురించి మాత్రమే కాదు.. అది ఒక జీవన విధానం. ఋతువుల మార్పులకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మనల్ని రక్షించే ఆహారాలు ..
1. పుచ్చకాయ:
వేసవిలో దొరికే బెస్ట్ ఫ్రూట్స్లో పుచ్చకాయ ఒకటి. ఆయుర్వేదం ప్రకారం ఇందులో.. నీటి శాతం ఎక్కువగా ఉండటమే కాకుండా.. ఇది శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది. ఇది అద్భుతమైన ‘పిత్త’ శామకారిగా పనిచేస్తుంది. అయితే.. దీనిని మధ్యాహ్న సమయంలో తీసుకోవడం బెస్ట్.
2. కొబ్బరి నీళ్లు:
ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం కొబ్బరి నీళ్లు. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడతాయి. ఇందులో ఉండే చలువ చేసే గుణాలు పొట్టలోని మంటను తగ్గించి, కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజూ కొబ్బరి నీరు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.
3. పెరుగు, మజ్జిగ :
పెరుగు కంటే మజ్జిగను ఆయుర్వేదం ఎక్కువగా ప్రోత్సహిస్తుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, సైంధవ లవణం కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగు పడటమే కాకుండా శరీరం తక్షణమే చల్లబడుతుంది. దీనిని ఆయుర్వేదంలో ‘సాత్వికమైన డ్రింక్’గా పరిగణిస్తారు.
4. కీరదోస :
కీరదోసకాయలో ఉండే ఫైబర్ , నీరు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయ పడతాయి. ఇది కేవలం ఆహారంగానే కాకుండా.. చర్మంపై వచ్చే చెమటకాయలు, వేడి గడ్డలను తగ్గించడానికి కూడా ఉపయోగ పడుతుంది. సలాడ్ రూపంలో దీనిని తీసుకోవడం వల్ల రక్తం కూడా శుద్ధి అవుతుంది.
5. పుదీనా :
పుదీనా ఆకులు సహజంగానే రిఫ్రెష్మెంట్ను ఇస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పుదీనా శరీరంలోని అదనపు వేడిని తొలగించి, శ్వాస వ్యవస్థను క్లియర్ చేస్తుంది. పుదీనా టీ లేదా మజ్జిగలో పుదీనా రసాన్ని కలిపి తీసుకోవడం వల్ల వేసవి అలసట దరిచేరదు.
Also Read: కిటికీ దగ్గర చెంచా ? వైరల్ అవుతున్న ఈ ట్రెండ్ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!
6. సోంపు గింజలు :
చాలా మంది భోజనం తర్వాత సోంపు తింటారు. దీనికి బలమైన ఆయుర్వేద కారణం ఉంది. సోంపు గింజలు జీర్ణవ్యవస్థను చల్లబరుస్తాయి. రాత్రిపూట సోంపును నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల శరీరంలోని అంతర్గత వేడి తగ్గి, కడుపు హాయిగా ఉంటుంది.
ముఖ్యమైన సూచనలు:
ఐస్ వాటర్ వద్దు: అతిగా చల్లగా ఉండే ఐస్ వాటర్ తాగడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. కుండలో నీరు తాగడం బెస్ట్.
మసాలాలు తగ్గించండి: వేసవిలో కారం, మసాలా, వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.
సమయం: ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు (మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు) బయటకు వెళ్లడం తగ్గించి, పై ఆహారాలను తీసుకోవాలి.