గర్భవతిగా ఉన్న సమయంలో మహిళలకు ఆహారం విషయంలో అనేక సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో మామిడి పండ్లు తినవచ్చా లేదా అనే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు. మామిడి పండ్లు శరీరంలో వేడిని పెంచుతాయని, అందువల్ల గర్భిణులు వాటిని తినకూడదని చాలా మంది నమ్ముతారు. అయితే వైద్య నిపుణులు ఈ నమ్మకానికి సైన్స్ పరంగా బలమైన ఆధారాలు లేవని చెబుతున్నారు. కానీ మితంగా తీసుకుంటే మామిడి పండ్లు గర్భిణులకు మంచి పోషకాహారంగా ఉపయోగపడతాయని సూచిస్తున్నారు.
గైనకాలజిస్ట్ డాక్టర్ వైదేహి మరాఠే ప్రకారం.. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు మామిడి పండ్లను భయపడకుండా తినవచ్చు. సాధారణ గర్భధారణలో మామిడి పండ్లు ఎటువంటి హాని చేయవు. అయితే ఇతర ఆహారాల మాదిరిగానే వీటిని కూడా మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. అధికంగా తినడం వల్ల కొన్ని అసౌకర్యాలు కలిగే అవకాశం ఉంటుంది.
మామిడి పండ్లు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, పోషక విలువలు కూడా ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిలో ‘విటమిన్ ఏ’, ‘విటమిన్ సీ’, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదలకు కూడా సహాయపడతాయి.
మామిడి పండ్లలో ఉండే ‘విటమిన్ ఏ’ శిశువు అవయవాలు, కణజాలాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ‘విటమిన్ సీ’ శరీరంలో ఐరన్ శోషణ మెరుగుపరుస్తుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
చాలామంది మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందని భావిస్తారు. అయితే దీనికి బలమైన వైద్య ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది గర్భిణులు మామిడి పండ్లు తిన్నా ఎలాంటి సమస్యలు ఎదుర్కోరు. అయినప్పటికీ వ్యక్తిగతంగా కొందరిలో స్వల్ప అసౌకర్యాలు కనిపించవచ్చు. అందుకే మితంగా తీసుకోవడం ఉత్తమం.
మామిడి పండ్లు అధికంగా తినడం వల్ల కడుపులో అసౌకర్యం, అజీర్ణం, గ్యాస్ లేదా గుండెల్లో మంట వంటి సమస్యలు కలగవచ్చు. కొందరికి శరీరంలో వేడి పెరిగినట్లు అనిపించవచ్చు. అదనంగా వీటిలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
గర్భధారణ సమయంలో కొందరు మహిళల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అలాంటి వారు మామిడి పండ్లు తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. వైద్యులు సూచించిన పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి.
Also Read: బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిన అవసరం లేదు.. తక్కువ ఖర్చుతో మృదువైన పాదాల కోసం ఇంట్లోనే పెడిక్యూర్
మామిడి పండ్లను తినే ముందు బాగా కడగాలి. సహజంగా పండిన పండ్లను ఎంచుకోవాలి. రసాయనాలతో మాగిన పండ్లను వీలైనంత వరకు నివారించడం మంచిది. అలాగే ఒకేసారి ఎక్కువగా తినకుండా ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో కలిపి తీసుకోవాలి.
మామిడి పండ్లు గర్భిణులకు విటమిన్లు, ఫైబర్, ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. ఆరోగ్యంగా ఉన్న గర్భిణులు వీటిని సురక్షితంగా తినవచ్చు. అయితే మితంగా తీసుకోవడం, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవడం చాలా అవసరం.