Hyderabad:లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్ ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్), ఎక్స్ సంస్థలను ఆదేశించింది. ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు ఎన్ వాదించారు. బాధితురాలు ఫోటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లలో కొనసాగుతుండడంతో ఆమె గోప్యతకి, గౌరవం, ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
పిటిషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం.. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు ఆయా డిజిటల్ ప్లాట్ ఫారంల గ్రీవెన్స్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. ఎలాంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. దీంతో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14,21, సమాచార సాంకేతిక చట్టం – 2000, ఐటీ (ఇంటర్మీడియరీ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ) రూల్స్ – 2021, అలాగే లైంగిక నేర బాధితుల గుర్తింపును వెల్లడించకూడదని, సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల అమలు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
also read:రూ.1కోటి ఫ్రీ టికెట్స్ పంచిపెట్టిన హీరో.. అసలు నిజం తెలిస్తే షాక్!
విచారణ చేపట్టిన జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేశారు. అలాగే పిటిషన్ కు జత చేసిన అనెక్సర్ – ఏ లో పేర్కొన్న 200 పైగా యూట్యూబ్ వీడియోలు , ఇంస్టాగ్రామ్ పోస్టులు, ఎక్స్ ట్వీట్ లు అలాగే ఇతర డిజిటల్ ప్రచురణలను తక్షణమే తొలగించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప్రతి వాద సంస్థలకు, వ్యక్తిగత నోటీసులు అందజేసేందుకు పిటిషనర్ తరపు న్యాయవాదికి అనుమతి ఇచ్చారు. ఈ కేసు తదుపరి విచారణను 2026 ఆగస్టు 20 కి వాయిదా వేయడం జరిగింది.
ఇక న్యాయ నిపుణుల అభిప్రాయ ప్రకారం.. ఈ మధ్యంతర ఉత్తర్వులు లైంగిక నేర బాధితుల డిజిటల్ గోప్యత గౌరవాన్ని కాపాడడంలో కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. అలాగే భారత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బాధితుల గుర్తింపును బహిర్గతం చేసే కంటెంట్ ను తొలగించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వేదికలపై ఉందని ఈ ఉత్తర్వులు మరోసారి స్పష్టం చేస్తున్నాయి.