Biryani Origin Country| బిర్యానీ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలలో ఒకటి. సువాసన, రుచికరమైన మసాలాలు, మృదువైన రైస్, నేయి, మాంసాహారం కలయికతో ఇది అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా మంది బిర్యానీ భారతదేశంలో పుట్టిందని భావిస్తారు. అయితే చరిత్రకారులు మాత్రం దీనిపై భిన్నమైన అభిప్రాయాలు చెబుతున్నారు. బిర్యానీ మూలాలు.. పర్షియా (ఇరాన్ పురాతన పేరు), ఆఫ్ఘనిస్తాన్, భారత్లతో ముడిపడి ఉన్నాయని అనేక కథనాలు ఉన్నాయి. అందుకే బిర్యానీ చరిత్ర ఇప్పటికీ ఆసక్తికరమైన చర్చగా కొనసాగుతోంది.
చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. బిర్యానీకి పుట్టినిల్లు పురాతన పర్షియా (ఇరాన్). “బిర్యానీ” అనే పదం పర్షియన్ భాషలోని “బిరింజ్ బిర్యాన్” అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. దాని అర్థం “వేయించిన రైస్ (అన్నం)”. పర్షియాలో వందల సంవత్సరాల క్రితం రాజుల కోసం వంట చేసేవారు ముందుగా నెయ్యిలో బియ్యాన్ని వేయించి, తరువాత మాంసం, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్, గింజలతో కలిపి నెమ్మదిగా ఉడికించేవారు. పాత్రను టైట్గా మూసి ఆవిరితో వండే వారు. ఈ విధానాన్ని ప్రస్తుతం దమ్ వంటగా పిలుస్తారు. అందుకే దమ్ బిర్యానీ అనే పేరు వచ్చింది.
పర్షియా నుంచి వ్యాపారులు, సైనికులు, ప్రయాణికులు.. బిర్యానీ రెసిపీని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లారని భావిస్తున్నారు. ఇస్ఫహాన్, నిషాపూర్, హెరాత్ వంటి నగరాల మీదుగా ఈ వంటకం కాబూల్కు చేరింది. అక్కడి స్థానిక వంటవారు తమ ప్రాంతపు పదార్థాలను జోడించి కొత్త రుచులను తీసుకొచ్చారు. ఈ విధంగా బిర్యానీ అనేక ప్రాంతీయ రూపాల్లో అభివృద్ధి చెందింది.
ఆఫ్ఘనిస్తాన్లోని హెరాత్, కాబూల్ రాజప్రాసాదాల్లో ప్రత్యేకమైన బియ్యం వంటకాలు తయారయ్యేవి. అందులో కాబులీ పలావ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇందులో అన్నం, గొర్రె మాంసం, క్యారెట్, ఎండుద్రాక్ష, బాదం, యాలకులు ఉపయోగిస్తారు. ఈ వంటకం నేటి బిర్యానీతో చాలా పోలికలు కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.
మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ మొదట ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ను పాలించాడు. 1526లో భారత్కు వచ్చినప్పుడు మధ్య ఆసియా, పర్షియా వంటకాల సంప్రదాయాలను కూడా తీసుకొచ్చాడు.
తర్వాత భారతీయ వంట మాస్టర్లు బాస్మతి బియ్యం, స్థానిక మసాలాలను కలిపి కొత్త బిర్యానీ రుచులను రూపొందించారు.
మరో కథనం ప్రకారం బిర్యానీ మొఘల్ కాలంలోనే ప్రాచుర్యం పొందింది. మొదట ఇది పులావ్ వంటి సాధారణ వంటకంగా ఉండేదని చెబుతారు. ఒకసారి సైనికులు.. అన్నం, అందుబాటులో ఉన్న మాంసంతో ఒకే పాత్రలో వండుకునే భోజనంగా దీన్ని తయారు చేశారు. ఆ తరువాత క్రమంగా ఇది రాజభవనాల్లో ప్రత్యేక వంటకంగా మారింది.
కొంతమంది పరిశోధకులు బిర్యానీ చరిత్ర ఇంకా పాతదని భావిస్తున్నారు. క్రీ.శ. రెండో శతాబ్దంలో తమిళనాడులో యోధుల కోసం తయారుచేసే అన్నం, మాంసం వంటకం గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ వంటలో నెయ్యి, మాంసం, తేజపత్రి, మిరియాలు ఉపయోగించేవారని పేర్కొంటారు. ఇదే తరువాత బిర్యానీ అభివృద్ధికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు.
భారతదేశంలో బిర్యానీకి నిజమైన గుర్తింపు అవధ్, హైదరాబాద్ రాజప్రాసాదాల్లో లభించింది. లక్నో అవధీ బిర్యానీ తన సున్నితమైన రుచితో ప్రసిద్ధి చెందింది. రాగి పాత్రల్లో నెమ్మదిగా దమ్ పద్ధతిలో వండటం దీని ప్రత్యేకత. హైదరాబాద్ బిర్యానీ మాత్రం కుంకుమపువ్వు, ఘాటైన మసాలాలతో ప్రత్యేక రుచిని అందించింది. ఈ రెండు రకాల బిర్యానీలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతో ఆదరణ పొందుతున్నాయి.
Also Read: మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి
బిర్యానీ ఒక్క దేశంలో పుట్టిందని కచ్చితంగా చెప్పడం కష్టం. శతాబ్దాల పాటు జరిగిన వాణిజ్యం, వలసలు, సంస్కృతుల కలయిక వల్ల ఈ వంటకం అనేక మార్పులు చెందింది. పర్షియా, ఆఫ్ఘనిస్తాన్, భారత్ మూడు ప్రాంతాల ప్రభావం బిర్యానీ అభివృద్ధిలో కనిపిస్తుంది.
నేడు బిర్యానీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే వంటకంగా నిలిచింది. దాని అసలు పుట్టుకపై చర్చ కొనసాగుతున్నప్పటికీ, వివిధ సంస్కృతుల రుచులను కలిపిన ప్రత్యేక వంటకంగా బిర్యానీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. భారతదేశంలో అయితే ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఆహార సంస్కృతిలో విడదీయరాని భాగంగా మారింది.