Memory Booster Foods: ఆరోగ్యకరమైన మెదడు కోసం మంచి ఆహారం చాలా అవసరం. మనం ప్రతిరోజూ తినే ఆహారం జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన పోషకాలు ఉన్న ఆహారం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే దీర్ఘకాలం మెదడు ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది.
రోజువారీ ఆహారంలో మెమరీ పెంచే పోషకాలు ఎక్కువగా ఉన్న ఐటెమ్స్ తీసుకోవడం ద్వారా జ్ఞాపకశక్తిని సహజంగా మెరుగుపరచుకోవచ్చు.
మెదడు సరిగా పనిచేయాలంటే విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. ఇవి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అలాగే మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరుస్తాయి. మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
పాలకూర, మెంతికూర, బ్రోకలీ, కేల్ వంటి ఆకుకూరల్లో మెదడుకు ఉపయోగపడే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ కె, ఫోలేట్, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ మెదడు పనితీరు తగ్గకుండా కూడా కాపాడవచ్చు. వీటిని కూరలు, సూప్లు లేదా సలాడ్ల రూపంలో తీసుకోవచ్చు.
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్.. మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. సాల్మన్, సార్డిన్, మాకెరెల్ వంటి చేపల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. శాకాహారులు వాల్ నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ తీసుకోవచ్చు. ఇవి జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
గుమ్మడికాయ గింజల్లో జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు అవసరం. అలాగే నేర్చుకునే సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి. రోజుకు కొద్దిపాటి గింజలను స్నాక్గా తినవచ్చు. సలాడ్లు లేదా పెరుగులో కలిపి కూడా తీసుకోవచ్చు.
కనీసం 70 శాతం కోకో ఉన్న డార్క్ చాక్లెట్ను ఎంపిక చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల మెదడు పనితీరు చురుకుగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ మానసిక ఉల్లాసాన్ని కూడా పెంచుతుంది. అయితే దీన్ని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి.
Also Read: చురుకైన మెదడు, మెరిసిపోయే చర్మం.. పురుషులు ఉదయాన్నే ఖాళీ కడుపున ఇవి తింటే ఎన్ని లాభాలో
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు కణాలను రక్షిస్తాయి. అలాగే మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని మెరుగుపరుస్తాయి. ఈ పండ్లను తరచుగా తింటే జ్ఞాపకశక్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది. వీటిని స్మూతీలు, ఓట్స్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు.
రోజంతా తగినంత నీరు తాగాలి. ప్రతిరోజూ వ్యాయామం లేదా నడక చేయాలి. ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ప్రతి రాత్రి సరిపడా నిద్రపోవాలి. పుస్తకాలు చదవడం, పజిల్స్ సాల్వ్ చేయడం వంటి మానసిక వ్యాయామాలు కూడా మెదడును చురుకుగా ఉంచుతాయి.