ఆధునిక జీవనశైలిలో అధిక రక్తపోటు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారిపోయింది. చిన్న వయసులోనే చాలా మంది రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యను నియంత్రించడానికి మందులు, వ్యాయామం, ఆహార నియమాలు వంటి అనేక మార్గాలను వైద్యులు సూచిస్తున్నారు. కొంతమంది నీరు ఎక్కువగా తాగడం ద్వారా హైబీపీ నియంత్రణలో ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? నీరు హైబీపీపై ఎలా ప్రభావం చూపుతుంది? ఈ విషయాన్ని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
మన శరీరం సుమారు అరవై శాతం నీటితోనే నిండి ఉంటుంది. రక్తం, కణాలు, కండరాలు, అవయవాలు అన్నీ నీటిపై ఆధారపడే ఉంటాయి. అందుకే శరీరం సక్రమంగా పని చేయాలంటే నీటిని సరైన మోతాదులో తీసుకోవటం తప్పనిసరి. కానీ ఇదే నీరు అధిక రక్తపోటుపై ప్రభావం చూపుతుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
నీటితో రక్తపోటు తగ్గుతుందా?
నీరు తాగడం వల్ల రక్తం సరైన ప్రమాణంలో పలచగా ఉంటుంది. దీని వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో కొంతమందిలో రక్తపోటు స్థాయులు స్థిరంగా ఉండటానికి సహాయం చేస్తుంది. అయితే నీరు ఎక్కువగా తాగితే హైబీపీ తగ్గిపోతుంది అనే వాదన పూర్తిగా శాస్త్రీయంగా నిర్ధారణ చేయలేదు.
అయితే శరీరంలో నీరు తగ్గితే డీహైడ్రేషన్ రక్తం కొంచెం మందంగా మారుతుంది. దీనివల్ల గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. రక్తం నాళాల్లో గట్టిగా ప్రవహిస్తుంది. రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది.అందుకే రోజంతా తగినంత నీరు తాగడం హైబీపీ ఉన్న వారికి చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నీరు సమృద్ధిగా ఉండటం వల్ల రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. ఇది రక్తపోటు స్థాయులను పెరగకుండా అడ్డుకునేందుకు సహాయపడుతుంది.
సోడియం తగ్గుతుంది
శరీరంలో ఎక్కువ సోడియం ఉండటం హైబీపీ ప్రధాన కారణం. నీరు ఎక్కువగా తాగితే సోడియం యూరిన్ ద్వారా బయటికి వెళ్లడానికి సహాయం చేస్తుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే రక్తపోటు కూడా పెరుగుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత పెరిగినా రక్తపోటు కొంచెం పెరుగుతుంది. నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఎంత నీరు తాగాలి?
పెద్దవారు రోజుకు 2 నుండి 2.5 లీటర్లకు తగ్గకుండా నీరు తాగడం చాలా అవసరం. హైబీపీ ఉన్నవారు రోజంతా చిన్నచిన్న మోతాదులలో ఎక్కువసార్లు నీరు తాగాలి. ఎక్కువ వేడి వాతావరణంలో ఉండేవారు, శారీరకంగా కష్డపడేవారు,అతిగా చెమట పట్టే పరిస్థితుల్లో ఉన్నవారు నీరు మరింత ఎక్కువగా తాగాలి.