హై బీపీ ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. వయసుతో సంబంధం లేకుండా యువతలో కూడా ఈ సమస్య పెరుగుతోంది. వైద్యులు దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తున్నారు. కారణం ఏమిటంటే మొదట్లో పెద్ద లక్షణాలు కనిపించకపోయినా లోపల గుండెపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. చాలామంది తలనొప్పి, అలసట, ఊపిరి సమస్యలను సాధారణంగా తీసుకుంటారు. కానీ ఇవే హై బీపీ ప్రారంభ సంకేతాలు కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో రోజువారీ పనులు చేస్తూ ఉండగానే కొన్ని చిన్న మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు. సరైన సమయానికి గుర్తిస్తే పెద్ద ప్రమాదాల నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ లక్షణం కనిపిస్తే జాగ్రత్త
ఉదయం లేవగానే తల వెనుక భాగంలో బరువుగా అనిపించడం హై బీపీ సంకేతంగా భావిస్తున్నారు. కొందరికి మెలకువ వచ్చిన వెంటనే తలనొప్పి మొదలవుతుంది. కొద్దిసేపు పని చేసినా అలసట ఎక్కువగా కనిపించొచ్చు. మెట్లు ఎక్కినా, వేగంగా నడిచినా ఊపిరి సరిగా తీసుకోలేని పరిస్థితి రావొచ్చు. చాలామంది దీన్ని వయసు ప్రభావం లేదా బలహీనతగా భావిస్తారు. కానీ గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు శరీరం ఇలా హెచ్చరికలు పంపుతుందని వైద్యులు చెబుతున్నారు. కొందరిలో గుండె వేగంగా కొట్టుకోవడం కూడా కనిపించొచ్చు. ఇలాంటి మార్పులు తరచూ కనిపిస్తే వెంటనే బీపీ చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కళ్లు మసకగా
కళ్లలో మసకగా కనిపించడం కూడా చిన్న హెచ్చరికే అంటున్నారు నిపుణులు. ఎక్కువసేపు మొబైల్ చూస్తే ఇలా జరుగుతుందని చాలామంది అనుకుంటారు. కానీ రక్తపోటు పెరిగితే కళ్లలోని చిన్న రక్తనాళాలపై ప్రభావం పడొచ్చు. దీంతో బ్లర్ విజన్ రావడం, రాత్రివేళ చదవడం కష్టంగా అనిపించడం జరుగుతుందని చెబుతున్నారు. కొందరిలో ఒక్కసారిగా తల తిరగడం కూడా కనిపించొచ్చు. అలాగే పడుకున్నప్పుడు గుండె చప్పుడు స్పష్టంగా వినిపించడం, ఛాతీలో ఒత్తిడి అనిపించడం కూడా హై బీపీ సంకేతాలే అంటున్నారు. తరచూ ముక్కు నుంచి రక్తం రావడం కూడా నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటి జీవనశైలి కూడా హై బీపీ ప్రమాదాన్ని పెంచుతోంది. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఫాస్ట్ ఫుడ్ అలవాటు, వ్యాయామం లేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. చాలామంది రోజంతా కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నారు. శారీరక శ్రమ తగ్గిపోవడంతో బీపీ సమస్యలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం కూడా గుండెపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. యువతలో గుండెపోటు కేసులు పెరగడానికి హై బీపీ కూడా ఒక కారణమని వైద్యులు చెబుతున్నారు. శరీరం ఇచ్చే చిన్న హెచ్చరికలను పట్టించుకోకపోతే భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదం పెరిగే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
30 ఏళ్లు దాటితే చాలు చెకప్
వైద్యుల సూచన ప్రకారం 30 ఏళ్లు దాటిన తర్వాత క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకోవాలి. ఇంట్లో డిజిటల్ బీపీ మిషన్ ఉంటే ఉదయం, సాయంత్రం కొలవడం మంచిదని చెబుతున్నారు. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం అరగంట నడక అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి తగ్గించే పనులు చేయడం, మంచి నిద్రపోవడం కూడా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. తలనొప్పి, ఊపిరి సమస్య, అలసట వంటి లక్షణాలు చిన్నవిగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.