Bandi Sanjay: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో ఎంపీ బండి సంజయ్ కుమార్ నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్, అస్సాం తరహాలోనే తెలంగాణలోనూ జై శ్రీరామ్ నినాదం మారుమోగుతోందని.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులకు తమ నినాదమే సమాధానమని ఆయన గర్జించారు. రామనామమే తమలో ఆవేశాన్ని, పౌరుషాన్ని నింపుతుందని.. ఆ నినాద బలం వల్లే గతంలో కేసీఆర్ గడీలు బద్దలయ్యాయని విశ్లేషించారు.
పశ్చిమ బెంగాల్లో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు బలిదానాలు చేశారని.. మహిళా కార్యకర్తలపై అమానుష దాడులు జరిగినా వెరవకుండా పోరాడి అక్కడ చారిత్రాత్మక విజయం సాధించామని బండి సంజయ్ గుర్తు చేశారు. కేరళలో పీఎఫ్ఐ గుండాలు కార్యకర్తల కళ్లు పీకేసినా.. కాళ్లు నరికేసినా ధర్మం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారని బావోధ్వేగానికి గురయ్యారు బండి సంజయ్. తెలంగాణలోనూ అమరవీరులైన కార్యకర్తల ఆత్మబలిదానాలను వృథా పోనివ్వమని.. వారి ఆశయ సాధన కోసం రాష్ట్రంలో మోదీ రాజ్యాన్ని, రామ రాజ్యాన్ని స్థాపించి తీరుతామని ప్రతినూనారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇస్తున్న నిధులపై ఆయన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ ‘జై శ్రీరామ్’ నినాదంతోనే రాష్ట్రానికి రూ. 9,400 కోట్ల అభివృద్ధి నిధులు కేటాయించారని చెప్పారు. రేషన్ బియ్యం, స్వచ్ఛ భారత్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు వేల కోట్ల రూపాయలు కేంద్రమే ఇస్తోందని స్పష్టం చేశారు. కానీ ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విస్మరించి.. తెలంగాణ నిధులను ఢిల్లీకి తరలిస్తోందని తీవ్రంగా విమర్శించారు. రైతుల పండించిన పంటను కొనుగోలు చేయకుండా రోడ్ల మీద ఎండబెట్టి అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు.
తాను సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించానని.. ఏబీవీపీ, యువమోర్చాలో పనిచేసి నరేంద్ర మోదీ శిష్యుడిగా ఇక్కడి వరకు వచ్చానని బండి సంజయ్ పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఏ బీజేపీ కార్యకర్త ఊరుకోడని హెచ్చరించారు. తాము ఏ వర్గానికి వ్యతిరేకం కాదని.. కానీ హిందూ సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. కార్యకర్తలారా మీ ఉడుకు రక్తం, పౌరుషం చూస్తుంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని.. అందరం కలిసికట్టుగా పనిచేసి తెలంగాణలో ధర్మ ఆధారిత అభివృద్ధిని సాధిద్దామని పిలుపునిచ్చారు.
Read Also: బెంగాల్ గెలిచాం.. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. సికింద్రాబాద్ సభలో ప్రధాని మోదీ