Salt: మనం తినే ఆహారంలో రుచి కోసం వేసుకునే ఉప్పు, మన శరీరానికే కాదు.. మన మనసుకి కూడా శత్రువుగా మారుతోందా ? అవుననే అంటున్నాయి తాజా పరిశోధనలు. అధిక ఉప్పు వాడకం వల్ల కేవలం గుండె జబ్బులు, బీపీ మాత్రమే కాకుండా ‘ఆందోళన’, ‘ఒత్తిడి’ కూడా పెరుగుతాయని తేలింది. ఉప్పులోని సోడియం మన శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను ఎలా ప్రేరేపిస్తుందో, ఉప్పు తగ్గించడం వల్ల మనసును ఎలా ప్రశాంతంగా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం.
సోడియం, కార్టిసోల్: అసలు సంబంధం ఏంటి?
మనం ఉప్పు ఎక్కువగా తీసుకున్నప్పుడు, అది రక్తంలో సోడియం స్థాయిలను పెంచుతుంది. ఈ మార్పును గమనించిన మెదడు వెంటనే ‘అలర్ట్’ మోడ్లోకి వెళ్తుంది.
కార్టిసోల్ విడుదల: అధిక సోడియం వల్ల శరీరంలో ‘కార్టిసోల్’అనే స్ట్రెస్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ఒక రకమైన ఆందోళన, గుండె వేగంగా కొట్టుకోవడం, టెన్షన్ వంటివి మొదలవుతాయి.
నీటి నిల్వ : ఉప్పు వల్ల కణాల్లో నీరు పేరుకుపోతుంది. దీనివల్ల శరీరం ఉబ్బినట్లు అనిపించి, మనసులో ఒక రకమైన అసౌకర్యం, చిరాకు కలిగిస్తుంది.
మెదడుపై ఉప్పు ప్రభావం:
పరిశోధనల ప్రకారం, అధిక ఉప్పు తీసుకునే వారిలో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అతిగా స్పందిస్తుంది. అంటే, చిన్న విషయాలకే మెదడు “పోరాడు లేదా పారిపో” అనే స్థితిలోకి వెళ్తుంది. దీనివల్ల ఏకాగ్రత దెబ్బతినడం, రాత్రిపూట నిద్రలో పదేపదే మెలకువ రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
రోజూ ఎంత ఉప్పు తినాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ (సుమారు ఒక టీస్పూన్) ఉప్పు మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రస్తుతం మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, పచ్చళ్ల రూపంలో రోజుకు 10-15 గ్రాముల ఉప్పు తింటున్నాము. ఈ అధిక మోతాదే మనల్ని మానసిక రోగులుగా మారుస్తోంది.
ఉప్పు తగ్గించడం వల్ల కలిగే ‘మెంటల్’ ప్రయోజనాలు:
ప్రశాంతమైన నిద్ర: శరీరంలో సోడియం సమతుల్యంగా ఉంటే.. మెలటోనిన్ హార్మోన్ బాగా పనిచేస్తుంది. తద్వారా గాఢ నిద్ర పడుతుంది.
తగ్గిన యాంగ్జైటీ: కార్టిసోల్ స్థాయిలు తగ్గడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నపాటి సమస్యలకు భయపడే గుణం తగ్గుతుంది.
మెరుగైన ఏకాగ్రత: మెదడుపై రసాయన ఒత్తిడి తగ్గడం వల్ల ఆలోచనా శక్తి పదునుగా మారుతుంది.
సోడియం నియంత్రించడానికి చిట్కాలు:
ప్రాసెస్డ్ ఫుడ్స్ వద్దు: ప్యాకెట్లలో దొరికే చిప్స్, ఇన్స్టంట్ నూడుల్స్, సాస్లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించండి.
పోటాషియం పెంచండి: అరటిపండు, ఆకుకూరలు వంటి పోటాషియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే.. అది శరీరంలోని అధిక సోడియంను బయటకు పంపుతుంది.
రుచికి ప్రత్యామ్నాయం: ఉప్పుకు బదులుగా నిమ్మరసం, మిరియాల పొడి లేదా ఇతర సహజ మసాలా దినుసులు వాడి రుచిని పెంచుకోండి.