Panchayat Bills: స్వచ్చ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ‘విద్యుత్’ బకాయిలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పేరుకుపోయిన కరెంటు బిల్లులు ఇప్పుడు ఏకంగా సుమారు రూ. 1,500 కోట్ల కు చేరినట్లు సమాచారం. పల్లెల్లో వెలిగే వీధి దీపాల నుంచి మొదలుకొని, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాల నిర్వహణ వరకు వాడిన విద్యుత్కు సంబంధించిన బకాయిలు కొండలా పేరుకుపోవడంతో పంచాయతీరాజ్ శాఖ తీవ్ర ఆందోళనలో పడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఈ భారీ బకాయిలను ఎలా వసూలు చేయాలో తెలియక డిస్కమ్లు, ఎలా చెల్లించాలో అర్థం కాక పంచాయతీలు తలలు పట్టుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నిధుల నుంచి ఈ బిల్లులను సర్దుబాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో కొత్త ఘర్షణకు దారితీసింది.
రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి సుమారు 30వేల వరకు విద్యుత్ బిల్లులు వస్తున్నట్లుసమాచారం. పంచాయతీల్లో నిత్యం విద్యుత్ లైట్లు, పల్లె ప్రకృతి వనాలు, ప్రతి ఇంటికి నీటి సరఫరా, క్రీడాప్రాంగణాలు, నర్సరీలు, ట్యాంకర్ల ద్వారా హరితహారం మొక్కలకు నీరు, గ్రామపంచాయతీ సిబ్బంది నిర్వహణకు ఇలా విద్యుత్ వినియోగం జరుగుతుంది. దీంతో పంచాయతీలకు బిల్లులు తడిసి మోపడంతా అవుతున్నాయి. ఇంకా మేజర్ గ్రామపంచాయతీల్లో 15 నుంచి 30వేలవరకు విద్యుత్ బిల్లు వస్తున్నట్లు సమాచారం.గ్రామ పరిధిని బట్టి బిల్లులు వస్తున్నాయి. గతంలో పంచాయతీకి పాలక వర్గాలు లేకపోవడంతో కొంత చెల్లింపుల్లో జాప్యం, ఆతర్వాత కేంద్రం నుంచి 15 ఫైనాన్స్ నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా చెల్లింపులు జరుగలేదు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలు విద్యుత్ శాఖకు సుమారు రూ. 1,500 కోట్లు బకాయి పడినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రాథమికంగా గుర్తించింది. ఈ బకాయిలు కేవలం ఒకటి రెండేళ్లలో పేరుకుపోయినవి కావని, నాటి నుంచి పంచాయతీల్లో కరెంట్ బిల్లుల బకాయిలు క్రమంగా పేరుకుపోతూ వచ్చినట్లు సమాచారం. అంటే ప్రతి నెల 12760 గ్రామపంచాయతీలకు సుమారు 20 నుంచి 30కోట్ల వరకు బిల్లులు వస్తున్నట్లు స్పష్టమవుతోంది.విద్యుత్ శాఖ అధికారులు మాత్రం 6వేలకు పైగా బిల్లులుపెండింగ్ లో ఉన్నాయని పేర్కొంటున్నారు.
Also Read: భారత్ నుంచి లండన్కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?
ఈ భారీ బకాయిల నుంచి గట్టెక్కేందుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులపై ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామాల్లోని మౌలిక వసతుల కోసం కేటాయించే ఈ నిధులను విద్యుత్ బకాయిల సర్దుబాటుకు ఉపయోగించాలని యోచిస్తోంది. ఒకవేళ ఈ నిధులను మళ్లించకపోతే.. బకాయిల వసూలు బాధ్యతను గ్రామ పంచాయతీ కార్యదర్శులపైనే నెట్టాలని చూస్తోంది. తక్షణమే పాత బకాయిల రికవరీ లేదా చెల్లింపులు జరపాలని, లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని కార్యదర్శులకు అంతర్గత ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీల ఖాతాల్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్ బకాయిలను డిజిటల్ కీస్ ఉపయోగించి చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై స్థానిక సర్పంచులు (ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన ఉన్నప్పటికీ, పాత సర్పంచుల ఒత్తిళ్లు, స్థానిక ప్రతినిధులు) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.ఈ నిధులన్నీ విద్యుత్ బిల్లులకే చెల్లిస్తే.. గ్రామాల్లో మురుగుకాల్వల శుభ్రంచేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం, తాగునీటి పైపుల లీకేజీల మరమ్మతులు వంటి కనీస అత్యవసర పనులకు పైసలు ఎక్కడి నుంచి తేవాలని వారు ప్రశ్నిస్తున్నారు. పలు జిల్లాల్లో కార్యదర్శులను నిధులు డ్రా చేయకుండా ప్రజాప్రతినిధులు అడ్డుకట్ట వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also read: డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!
15వ ఆర్ధికసంఘం నిధులను కరెంటు బిల్లుల చెల్లింపునకు జరుగుతున్న ప్రయత్నాలపై ఉన్నతాధికారులు సమర్ధిస్తున్నారు. కేంద్ర ఆర్థిక సంఘం మార్గదర్శకాల ప్రకారమే స్థానిక సంస్థల్లో తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి కనీస సేవలకు ఈ నిధులను వినియోగించుకోవచ్చని వారుఅభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో విద్యుత్ వినియోగం కూడా ఈ కనీస సేవల పరిధిలోకి వస్తుందని, నిబంధనల ప్రకారమే బకాయిలు చెల్లించాలని ఆదేశించినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ మాత్రం..కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేటాయించే ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిల చెల్లింపులకు ఎలా మళ్లిస్తారని కేంద్ర ప్రశ్నించారు. కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి, కేంద్రం ఇచ్చే నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
“గత ప్రభుత్వాల హయాంలో నిధులు సకాలంలో రాక, నర్సరీలు, క్రీడా ప్రాంగణాల మెయింటెనెన్స్ బిల్లులు పెరిగిపోయాయి. ఇప్పుడు ఆ పాత బకాయిలను కట్టమంటే ఎలా? గ్రామాల్లో ఇతర అత్యవసర పనులకు నిధులు లేక ఇబ్బంది పడుతుంటే, ఉన్న నిధులను కరెంటు బిల్లులకు మళ్లిస్తే గ్రామాలు మరింత వెనుకబడిపోతాయి” అని సర్పంచుల సంఘం ప్రతినిధులుఅభిప్రాయపడుతున్నారు. రూ. 1,500 కోట్ల విద్యుత్ బకాయిల పంచాయితీ ఇప్పుడు అటు డిస్కమ్లకు, ఇటు పంచాయతీరాజ్ శాఖకు పెద్ద తలనొప్పిగా మారింది. మరి ప్రభుత్వం ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో, పల్లెల్లో కరెంట్ వెలుగులు కొనసాగుతాయో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే ఒకవైపు డిస్కంల ఒత్తిడి, మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యంతరాల మధ్య నలిగిపోతున్న పంచాయతీ కార్యదర్శులు ఈ వివాదం ఎటు దారితీస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
Also read: Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం