Reheat Foods: చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏమిటంటే.. రాత్రి మిగిలిన కూరలను ఫ్రిజ్లో పెట్టి, మరుసటి రోజు మళ్లీ వేడి చేసుకుని తినడం. అయితే ఈ అలవాటు అంత సురక్షితం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని కూరగాయల్లో సహజంగా ఉండే నైట్రేట్లు, మళ్లీ వేడి చేసినప్పుడు నైట్రోసమైన్లు అనే హానికర పదార్థాలుగా మారే అవకాశం ఉంటుంది. ఇవి శరీరానికి హాని చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆహార పదార్థాలను రీహీట్ చేయకూడదో తెలుసుకుందాం.
పాలకూరను మళ్లీ మళ్లీ వేడిచేసి తినడం అత్యంత ప్రమాదకరమని వైద్యలు చెబుతున్నారు. దీనిలో ఉండే అధిక నైట్రేట్లు మళ్లీ వేడి చేసినప్పుడు నైట్రోసమైన్లుగా మారి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గించే ప్రమాదం ఉంది. చిన్న పిల్లల్లో ‘బ్లూ స్కిన్ సిండ్రోమ్’ వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇక పెద్దవారు తల తిరగడం, వాంతులు, తలనొప్పి, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అంతేకాదు.. రెండోసారి వేడి చేసినప్పుడు పాలకూరలోని ఐరన్ ఆక్సీకరణానికి గురై ఫ్రీ రాడికల్స్ను ఉత్పత్తి చేస్తుంది. అవి శరీరానికి మరింత హాని కలిగిస్తాయి.
బంగాళాదుంపను రెండోసారి వేడి చేసుకుని తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. బొటులిజం అనే బాక్టీరియా ఉత్పత్తి చేసే శక్తివంతమైన న్యూరోటాక్సిన్ వల్ల తీవ్రమైన, ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ సోకవచ్చు. దీనివల్ల నాడీ వ్యవస్థ బలహీనపడి.. పక్షవాతం వచ్చే ప్రమాదం ఎక్కువ. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అలాగే ఆలూలోని స్టార్చ్ మళ్లీ వేడి చేసినప్పుడు రసాయనికంగా విచ్ఛిన్నమై హానికర సమ్మేళనాలను తయారు చేస్తుంది. ఇవి జీర్ణవ్యవస్థకు దెబ్బతీసే అవకాశం ఉంది.
పుట్టగొడుగుల్లో ఉండే ప్రోటీన్.. తిరిగి వేడి చేసినప్పుడు శరీరం మీద ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. దీంతో కడుపు నొప్పి, గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి పుట్టగొడుగుతో చేసిన వంటకాలను తాజాగానే తినాలి. మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తినే పద్ధతిని పూర్తిగా నివారించాలి.
అలాగే వైట్ రైస్ను మళ్లీ వేడి చేయడం వల్ల బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇలాంటి అన్నం తింటే.. తీవ్రమైన వాంతులు, విరేచనాలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల రైస్ను ఫ్రిజ్లో పెట్టి ఎక్కువసేపు నిల్వ చేయకుండా.. తాగాజా వండిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే తినేయడం ఉత్తమం. అలాగే రీహీట్ చేయకూడని ఆహార పదార్థాల జాబితాలోకి క్యారెట్లు, టర్నిప్లు, కొన్ని రకాల దుంపలు కూడా వస్తాయి.