Diabetes: మధుమేహం ఉన్నవారు లేదా రాకుండా జాగ్రత్త పడేవారు ముందుగా భయపడేది అన్నం విషయంలోనే. “అన్నం తింటే షుగర్ పెరుగుతుంది” అనే ఒక బలమైన అపోహ సమాజంలో ఉంది. అయితే.. అన్నం నేరుగా డయాబెటిస్కు కారణం కాదు. సమస్య అన్నంలో లేదు, మనం తీసుకునే పరిమాణం, అన్నం రకం, దానితో పాటు తీసుకునే ఇతర ఆహార పదార్థాల కలయికలో ఉంది. డాక్టర్లు చెబుతున్న వివరాల ప్రకారం.. సరైన పద్ధతిలో అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
చాలా మంది తెల్ల అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, అది తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని భయపడతారు. ఇది కొంత వరకు నిజమే అయినా.. అన్నాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు.
గ్లైసిమిక్ ఇండెక్స్ : తెల్ల అన్నం యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ, మనం అన్నాన్ని ఒట్టిగా తినం. పప్పు, కూరగాయలు, పెరుగు లేదా నెయ్యితో కలిపి తింటాం. ఇలా ఫైబర్ (పీచు), ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తిన్నప్పుడు, అన్నం అరిగే వేగం తగ్గి రక్తంలో చక్కెర నెమ్మదిగా కలుస్తుంది.
పోర్షన్ కంట్రోల్: సమస్య అన్నం కాదు, మనం తినే ప్లేట్ నిండా అన్నం పెట్టుకోవడం. ప్లేట్లో సగం భాగం కూరగాయలు, పావు భాగం ప్రోటీన్ (పప్పు/మాంసం), మిగిలిన పావు భాగం మాత్రమే అన్నం ఉంటే అది డయాబెటిస్కు దారి తీయదు.
పాలిష్ అన్నం వద్దు: పాలిష్ చేసిన సన్న బియ్యం కంటే దంపుడు బియ్యం లేదా సింగిల్ పాలిష్ బియ్యంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.
డాక్టర్ల సూచన: శారీరక శ్రమ లేకుండా ఎక్కువ కేలరీలు తీసుకోవడమే డయాబెటిస్కు ప్రధాన కారణం. అన్నం తిని తగినంత వ్యాయామం చేస్తే అది శక్తిగా మారుతుంది తప్ప వ్యాధిగా కాదు.