Mahabharata Parenting| ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రయోజకులుగా చేయాలనుకుంటారు. అందుకే వారిని ప్రేమతో పెంచుతారు. వారికి ఏ లోటు లేకుండా అన్ని సమకూర్చాలని చూస్తారు. అయితే పిల్లలను పెంచడానికి ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. వారికి క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం, వారిని అర్థం చేసుకునే మనస్తత్వం కూడా అవసరం. ఈ మూడింటి మధ్య సమతుల్యత ఉంటేనే పిల్లలు సరైన మార్గంలో జీవన ప్రయాణం సాగిస్తారు. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు పిల్లలు తప్పు దారి పట్టవచ్చు.
మానవ సంబంధాలు, పెంపకం గురించి మహాభారతంలో మంచి పాఠాలున్నాయి. నేటి ప్రపంచానికి కూడా ఈ పాఠాలు వర్తిస్తాయి. వాటిలో తల్లిదండ్రులకు తగిన మూడు పాఠాలున్నాయి.
చాలామంది తల్లిదండ్రులు పిలల్లను చాలా గారాబంగా పెంచుతారు. పిల్లలు ఏం కోరినా వారి ఇవ్వాలని భావిస్తారు. అయితే ఈ అతి ప్రేమలో క్రమశిక్షణ లేకపోతే పిల్లలు చెడిపోవచ్చు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు తన కుమారుడు దుర్యోధనుడి తప్పుల గురించి తెలిసి కూడా పుత్ర వ్యామోహంలో నిర్లక్ష్యం చేశాడు. ఆయన బాధ్యతగల మహారాజు పదవిలో ఉన్నా.. తన కొడుకు చేసే తప్పులను సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోలేదు. దీని వల్ల దుర్యోధనుడు ఒక మొండివాడిగా, అహంకారిగా మారాడు.
తల్లిదండ్రులు.. పిల్లల ప్రతి కోరిక తీర్చకూడదు. వారి కోరిక సమంజసం లేకపోతే పిల్లలకు తప్పు ఒప్పు గురించి నేర్పించాలి. వినకపోతే హెచ్చరించాలి. కుదిరితే దండించాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో బాధ్యతా భావం కలుగుతుంది. జీవిత పరిమితుల గురించి నేర్చుకుంటారు. తప్పులను పట్టించుకోకపోవడం వల్ల పిల్లల స్వభావం బలహీనమవుతుంది. ప్రేమతో పాటు క్రమశిక్షణ కూడా అవసరం.
పిల్లలకు ఆహారం, బట్టలు, చదువు ఇవ్వడం మాత్రమే సరిపోదు. వారిని సరిగా అర్థం చేసుకోవాలి. వారికి అవసరమైన విషయాల గురించి అవగాహన కల్పించాలి. మహాభారతంలో కర్ణుడు జీవితాంతం భావోద్వేగంగా, ఒంటరితనంతో ఉంటాడు. బాల్యంలో కర్ణడిని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉండరు. ఈ లోటు కారణంగా అతను తీసుకునే నిర్ణయాలు, అతడి మిత్రులు, కుటుంబ సభ్యులను ప్రభావితం చేసింది.
ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు కూడా ఇలాంటి భావనను వ్యక్తం చేస్తారు. “తల్లిదండ్రులు అన్నీ ఇస్తారు కానీ మమ్మల్ని అర్థం చేసుకోరు” అని అంటారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలను సరిగా అర్థం చేసుకుంటే వారికి మంచి చెడు నేర్పించడం సులభం అవుతుంది. ఆ తరువాత పిల్లలు చెప్పినట్లు వింటారు. రోజూ కొంత సమయం పిల్లలతో గడపండి. వారు మాట్లాడేటప్పుడు అడ్డు చెప్పకుండా వినండి. వారి అభిప్రాయాలకు గౌరివిస్తున్నట్లు వ్యవహరించండి. అవసరమైనప్పుడు వారితో ఒక స్నేహితుడిలా ప్రవర్తించండి. ఇలా చేస్తే వారిలో నమ్మకం పెరుగుతుంది. దీంతో పిల్లలు తప్పు చేస్తే వారిని ఆపవచ్చు. అలా చేయకూడదని చెబితే పిల్లలు అర్థం చేసుకుంటారు.
Also Read: మీ పిల్లాడు సరిగా చదువుకోవడం లేదా? పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచడానికి ఈ ట్రిక్స్ పాటించండి
ఎదిగే పిల్లలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. టీనేజ్ వయసు చాలా సున్నితమైనది. ఈ దశలో స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మహాభారతంలో దుర్యోధనుడు కూడా ఈ వయసులోనే శకుని చెడు సావాసం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. అదే భీష్ముడి వద్ద ఎక్కువ కాలం గడిపి ఉంటే దుర్యోధనుడికి సరైన మార్గదర్శకత్వం లభించేది. అతని జీవితం మారేది. ఈ రోజు 13 నుంచి 17 సంవత్సరాల మధ్య పిల్లలపై వారి చుట్టుపక్కల ఉండేవారి ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
తల్లిదండ్రులు ఈ దశలో ఉన్న పిల్లలకు మార్గదర్శకులుగా వ్యవహరించాలి. అయితే వారిపై అనుమానంతో వారి ప్రతి విషయాన్ని తప్పుపట్టకూడదు. అందుకోసం పిల్లల ఎటువంటి వాతావరణంలో ఉన్నారో తెలుసుకోవాలి. వారి స్నేహితుల గురించి, రోజువారీ కార్యకలాపాల గురించి తెలుసుకోండి. వారికి తోడుగా తాము ఉన్నామని తల్లిదండ్రులు నమ్మకం కలిగించాలి. తద్వారా పిల్లలు స్వయంగా తమ సమస్యలు చెప్పుకుంటారు.
పిల్లల పెంపకం కోసం ఓర్పు, అవగాహన కలిగి ఉండాలి. మహాభారతంలో.. పిల్లలని ఎలా పెంచాలో, ఎలా పెంచకూడదో తల్లిదండ్రులకు పాఠాలు ఉన్నాయి. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వం, పిల్లలను అర్థం చేసుకునే మనస్తత్వం. ఈ విలువలను రోజువారీ జీవితంలో అమలు చేస్తే పిల్లలు బాధ్యతావంతులై, ప్రయోజకులుగా ఎదుగుతారు.