ప్రస్తుతం యువతలో ఎక్కువగా కనిపిస్తున్న చర్మ సమస్యల్లో మొటిమలు ఒకటి. వాతావరణ మార్పులు, స్ట్రెస్, హార్మోన్ సమస్యలు మాత్రమే కాదు… మనం తినే ఆహారం కూడా మొటిమలపై పెద్ద ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా రోజూ తినే అన్నం, రోటి లేదా చపాతీ వంటి ఆహారాల గురించి చాలా మందిలో సందేహం ఉంది. మొటిమలు తగ్గాలంటే రైస్ తినాలా? రోటి తినాలా? అనే అనుమానం ఎక్కువమందిలో ఉంది.
రోటీ తినడమే బెటర్
ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం, తెల్ల బియ్యం కంటే గోధుమ రోటీ మొటిమలు తగ్గించడంలో కొంత మెరుగ్గా పనిచేస్తుంది. దీనికి కారణం గ్లైసెమిక్ ఇండెక్స్ (GI). అంటే మనం తినే ఆహారం రక్తంలో చక్కెర స్థాయిని ఎంత వేగంగా పెంచుతుందో అదే GI. తెల్ల బియ్యంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. దీంతో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరిగి, శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది. ఈ మార్పులు చర్మంపై ప్రభావం చూపి మొటిమలు రావడానికి దారితీస్తాయి. ఇన్సులిన్ పెరిగినప్పుడు IGF-1 అనే హార్మోన్ కూడా పెరుగుతుంది. ఇది చర్మంలో ఆయిల్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ ఆయిల్ ఎక్కువైతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. దాంతో మొటిమలు త్వరగా వస్తాయి. అందుకే ఎక్కువగా తెల్ల బియ్యం తినేవారిలో మొటిమలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also read: Salary tips: జీతం వచ్చిన వెంటనే ఇలా చేస్తే డబ్బు కొరత ఉండదు
ఇక రోటీ విషయానికి వస్తే ఇది గోధుమ పిండితో తయారవుతుంది. గోధుమలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం నెమ్మదిగా జీర్ణం అవుతుంది. దీంతో బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగదు. హార్మోన్లలో మార్పులు కూడా తగ్గుతాయి. ఈ కారణంగా మొటిమలు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి. అందుకే రోటీ స్కిన్కు కొంత వరకు మంచిదిగా భావిస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం గట్ హెల్త్ అంటే జీర్ణక్రియ ఆరోగ్యం. మన కడుపు ఆరోగ్యం బాగుంటే అది మన ముఖంపై కూడా ప్రతిఫలిస్తుంది. గోధుమ రోటీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సరిగా జరుగుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు ఇది సహాయపడుతుంది. దీంతో చర్మం క్లియర్గా కనిపిస్తుంది. కానీ తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల ఈ ప్రయోజనం అంతగా ఉండదు.
బ్రౌన్ రైస్ తినవచ్చు
అలాగని బియ్యం పూర్తిగా చెడు చేస్తుందని చెప్పడం లేదు. ముఖ్యంగా బ్రౌన్ రైస్ (brown rice) తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. బ్రౌన్ రైస్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి మొటిమలు తగ్గించుకోవాలనుకునేవారు తెల్ల బియ్యం బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కొంతమందికి గోధుమలో ఉన్న గ్లూటెన్ సరిపడకపోవచ్చు. అలాంటి వారికి రోటీ తింటే జీర్ణక్రియ సమస్యలు, చర్మ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అలాంటి వారు బియ్యం, ముఖ్యంగా బ్రౌన్ రైస్ వైపు వెళ్లడం మంచిది. అంటే ప్రతి ఒక్కరికీ ఒకే ఆహారం సరిపోదు. మన శరీరానికి ఏది సరిపోతుందో చూసుకుని నిర్ణయం తీసుకోవాలి.
మొటిమలు తగ్గించుకోవాలంటే సాధారణంగా గోధుమ రోటీ మంచిదిగా భావిస్తున్నారు. కానీ బియ్యాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. తెల్ల బియ్యం తగ్గించి, బ్రౌన్ రైస్ తీసుకోవడం ఉత్తమం. అలాగే ఏ ఆహారం తిన్నా దానికి కూరగాయలు, ప్రోటీన్ ఉన్న పదార్థాలు జత చేస్తే స్కిన్ ఆరోగ్యం ఇంకా మెరుగవుతుంది.