ఇంట్లోనే ధాబా స్టైల్ ఎగ్ కర్రీని వండుకోవచ్చు. దీని రెసిపీ చాలా సులువు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే టేస్టీ ఎగ్ గ్రేవీ వండేయచ్చు. వేడి వేడి అన్నంలో ఈ గ్రేవీ వేసుకుని తింటే ఆ రుచే వేరు.ఇది అన్నం, చపాతీ, రోటీ.. ఇలా దేనితో తిన్నా కర్రీ అదిరిపోతుంది.
ధాబా స్టైల్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు
గుడ్లు – ఆరు
ఉల్లిపాయలు – మూడు (సన్నగా తరిగినవి)
టమోటాలు – రెండు (మెత్తగా తరిగినవి లేదా మెత్తగా రుబ్బినవి)
అల్లం వెల్లులి పేస్ట్ – ఒక స్పూను
పచ్చిమిర్చి – రెండు (సన్నగా తరిగినవి)
నూనె – మూడు స్పూన్లు
జీలకర్ర – అర చెంచా
పసుపు – పావు చెంచా
కారం – రుచికి సరిపడా
ధనియాల పొడి – ఒక స్పూను
గరం మసాలా – అరస్పూను
ఉప్పు – అవసరమైనంత
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నీరు – అవసరమైనంత
ధాబా స్టైల్ ఎగ్ కర్రీ రెసిపీ
1. ముందుగా గుడ్లను నీటిలో వేసి బాగా ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తరువాత చల్లని నీటిలో వేసి తొక్క తీసేయాలి. గుడ్డు మీద చిన్న చిన్న గీతల్లా కోసి పెట్టుకోవాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి గుడ్లను వేయించాలి. ఇలా చేస్తే గుడ్లకు మంచి రుచి వస్తుంది. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే కళాయిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర వేయాలి. జీలకర్ర చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.
4. ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చిన తరువాత అల్లం వెల్లులి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయాలి.
5. తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు వేసి బాగా కలపాలి. టమోటాలు మెత్తగా మారి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
6. ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి మసాలాను బాగా కలపాలి.
7. మసాలా సిద్ధమైన తరువాత కొద్దిగా నీరు వేసి గ్రేవీలా తయారుచేయాలి.
8. గ్రేవీ ఎక్కువ పల్చగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా చూసుకోవాలి.
9. ఇప్పుడు ముందుగా వేయించిన గుడ్లను గ్రేవీలో వేసి మెల్లగా కలపాలి. గుడ్లు మసాలాతో కలిసి మరిగేలా రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.
10. చివరగా గరం మసాలా వేసి కలపాలి. పైన కొత్తిమీర చల్లి మంట ఆపేయాలి. కొద్దిసేపు మూత పెట్టి ఉంచితే మసాలా కోడిగుడ్లకు బాగా పడుతుంది.
ఈ ధాబా స్టైల్ ఎగ్ కర్రీని వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, నాన్తో కూడా బాగా సరిపోతుంది. ఇంట్లో చేసినప్పటికీ బయట హోటల్ రుచిని గుర్తు చేసేలా ఈ కర్రీ ఉంటుంది.