DGP Ramachandra Rao: కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయి అధికారికి సంబంధించిన ఒక అశ్లీల వీడియో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు తన అధికారిక ఛాంబర్లో ఉండగానే మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు వార్తలు రావడంతో ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
కర్ణాటకలో సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. రామచంద్రరావు తన కార్యాలయంలోనే రాసలీలలకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు అధికారి ఖాకీ యూనిఫాంలో డ్యూటీలో ఉండగానే, ఆఫీస్ ఛాంబర్లోకి వచ్చిన మహిళలను హత్తుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి అసభ్యకర చేష్టలకు పాల్పడినట్లు ఆ వీడియోలలో కనిపిస్తోంది. మహిళలు వేర్వేరు సందర్భాలలో కార్యాలయానికి వచ్చారని, ప్రతిసారీ భిన్నంగా దుస్తులు ధరించినట్లు తెలుస్తోంది.
ఈ ఆరోపణలను డీజీపీ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. తనను వ్యక్తిగతంగా దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని అన్నారు. వైరల్ అవుతున్న వీడియోలు మార్ఫింగ్ చేసినవని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ మేధ (AI) సాయంతో ఈ నకిలీ వీడియోలను సృష్టించారని ఆయన వాదిస్తున్నారు.
1993 బ్యాచ్కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. మార్చి 2025లో ఈయన కుమార్తె (సవతి కూతురు), కన్నడ నటి రన్యా రావు దుబాయ్ నుండి 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయింది. ఈ కేసులో ప్రోటోకాల్ దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం రామచంద్రరావును నిర్బంధ సెలవుపై పంపింది. ఈ కేసులో ఆయనపై ప్రత్యక్ష ఆధారాలు లేకపోవడంతో, ఆగస్టు 2025లో ప్రభుత్వం ఆయన్ని తిరిగి విధుల్లోకి తీసుకుని సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా నియమించింది.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. తాజా వీడియోల వ్యవహారంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ కార్యాలయాల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించిన సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ వీడియోల వాస్తవికతను తేల్చేందుకు ఫోరెన్సిక్ దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది.
Read Also: Nitin Nabin: బీజేపీ కొత్త బాస్ ఫిక్స్.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం!