మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. అలాంటి వాటిలో ఒకటి పాలలో ఖర్జూరం నానబెట్టి తాగడం. సాధారణంగా ఖర్జూరాన్ని అలాగే నేరుగా తినడం చాలా మందికి అలవాటు. అయితే ఖర్జూరాన్ని రాత్రంతా పాలలో నానబెట్టి, ఉదయం లేదా రాత్రి వేడి పాలతో కలిపి తాగితే మరింత ఆరోగ్యదాయకమని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి శక్తినిచ్చే సహజ పానీయం మాత్రమే కాదు అనేక పోషకాల సమ్మేళనం కూడా.
వెంటనే శక్తినిస్తుంది
ఖర్జూరాల్లో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ ఎనర్జీ అందుతుంది. ముఖ్యంగా ఉదయం ఖర్జూరం పాలు తాగితే అలసట తగ్గి రోజంతా శక్తితో ఉండవచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారు, ఉద్యోగం కోసం ఉదయం తొందరగా ఆఫీసుకు బయలుదేరేవారికి ఇది మంచి ఎనర్జీ డ్రింక్లా ఇది పనిచేస్తుంది.
రక్తహీనతపై మంచి ప్రభావం
నేటి జీవనశైలిలో రక్తహీనత సమస్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఖర్జూరాల్లో సహజ ఐరన్ సమృద్ధిగా ఉండటం, పాలలో కాల్షియం ఉండటం వల్ల ఈ రెండు కలిపి తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. రెగ్యులర్గా తీసుకుంటే రక్తహీనత తగ్గడంలో సహాయపడుతుంది.
ఎముకలు బలంగా
ఎముకల బలానికి కాల్షియం, మెగ్నీషియం చాలా ముఖ్యం. పాలు కాల్షియం ఇస్తే, ఖర్జూరం మాగ్నీషియం, పొటాషియం అందిస్తుంది. ఈ రెండిటి కలయిక ఎముకలను బలపరచడమే కాకుండా కీళ్ల నొప్పులను తగ్గించడంలో కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు, గర్భిణులకు ఇది ఎంతగానో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు చాలామందిని ఇబ్బందులు పెడతాయి. ఖర్జూరం ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. రాత్రి నానబెట్టిన ఖర్జూరాన్ని పాలతో తీసుకుంటే మల విసర్జన సాఫీగా అవుతుంది.
గుండె ఆరోగ్యానికి మేలు
ఖర్జూరాల్లో ఉండే పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో ఇవి సహాయపడతాయి. రెగ్యులర్గా తీసుకుంటే గుండెకు రక్షణగా పనిచేస్తుందని పోషక నిపుణులు చెబుతున్నారు. పాలను రాత్రి తాగితే నిద్ర బాగా పడుతుందని తెలిసిందే. ఖర్జూరంలో కూడా శరీరాన్ని రిలాక్స్ చేసే కొన్ని సహజ పదార్థాలు ఉంటాయి. రాత్రి వేడి పాలలో నానబెట్టిన ఖర్జూరం తీసుకుంటే నిద్ర నాణ్యత మెరుగవుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
పాలు, ఖర్జూరం రెండూ విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లకు ప్రాచుర్యం పొందిన ఆహారాలు. రోజూ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరిగి జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు, బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఇది ఒక మంచి ఆరోగ్య పానీయం. గర్భిణీలు రక్తహీనత, బలం తగ్గడం, అలసట వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఖర్జూరం పాలు శక్తినిచ్చే ఆహారంగా మాత్రమే కాదు, శిశువు ఎదుగుదలకు కూడా ఉపకరిస్తుంది. అయితే గర్భిణీలు డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
ఎలా తీసుకోవాలి?
ఈ మిశ్రమంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ తీసుకుంటే చర్మం మెరుస్తుందని, పొడిబారడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రెండు లేదా మూడు ఖర్జూరాలను రాత్రి వేడి లేదా గోరువెచ్చని పాలలో నానబెట్టి ఉదయం లేదా రాత్రి వేడి పాలతో పాటు తాగడం ఉత్తమం.