Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ కేబినెట్ కూర్పులో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను నితీష్ కుమార్ కోల్పోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆ శాఖను బీజేపీకి కేటాయించారు. ఇది సంకీర్ణంలో అధికార పంపిణీకి నిదర్శనంగా మారింది.
2005 సంవత్సరం నుంచి ఇప్పటివరకు హోం శాఖ నితీష్ కుమార్ వద్దనే ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాటు నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారీ ఈ కీలకమైన శాఖను తన వద్దనే ఉంచుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ అంశాన్ని ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా చూసేవారు. అయితే తాజాగా బీజేపీతో ఏర్పడిన ప్రభుత్వంలో హోం శాఖను మిత్రపక్షానికి అప్పగించాల్సి వచ్చింది. ఇది జనతాదళ్ (యునైటెడ్) పార్టీకి కొద్దిపాటి ఇబ్బంది కలిగించినా సంకీర్ణ ధర్మాన్ని పాటించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
నితీష్ కుమార్ కేబినెట్లో బీహార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సామ్రాట్ చౌదరికి హోం మినిస్ట్రీ అప్పగించారు. చౌదరి బీజేపీకి చెందిన యువ నాయకుడు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ పగ్గాలు కూడా ఆయనకే దక్కాయి. హోం శాఖ కేటాయింపుతో ఆయన ప్రాధాన్యత పెరిగింది. శాంతిభద్రతల నిర్వహణ విషయంలో ఆయన పనితీరుపై ఇప్పుడు రాష్ట్ర ప్రజలు దృష్టి సారించారు.
కొత్త ప్రభుత్వంలో అనేక ఇతర ముఖ్య శాఖలను కూడా బీజేపీ జేడీయూ నాయకులకు కేటాయించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ కుమార్ సిన్హాకు రోడ్లు భవనాలు పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉండగా సాధారణ పరిపాలన కేబినెట్ సచివాలయం వంటి ముఖ్య శాఖలను తన వద్ద ఉంచుకున్నారు. సంకీర్ణ భాగస్వాములు వ్యూహాత్మకంగా శాఖలను పంచుకోవడంతో పాలనపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ శాఖల కేటాయింపు నితీష్ కుమార్ సంకీర్ణంలో మరింత మెరుగైన సమన్వయం కోసం కృషి చేస్తున్నారని తెలుస్తోంది. హోం శాఖపై పట్టు కోల్పోయినప్పటికీ నితీష్ కుమార్ పరిపాలనా అనుభవం సంకీర్ణాన్ని ముందుకు నడిపిస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.