Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని రేవా జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. టీచర్ వేధింపుల కారణంగానే తను ఆత్మహత్య చేసుకుంటున్నానని విద్యార్థిని సూసైడ్ నోట్ రాసింది. పోలీసులు ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు. ఐదు రోజుల క్రితం 17 ఏళ్ల విద్యార్థిని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. దీనిపై అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆర్తి సింగ్ వివరాలు వెల్లడించారు. విద్యార్థిని నోట్బుక్లో చేతితో రాసిన సూసైడ్ నోట్ దొరికిందని పోలీసులు తెలిపారు.
సూసైడ్ నోట్లో విద్యార్థిని తన టీచర్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. టీచర్ తనను కొట్టే సమయంలో చేతిని గట్టిగా పట్టుకున్నాడని పేర్కొంది. తన పిడికిలిని తెరవాలని ఇబ్బందులకు కూడా గురి చేశాడని రాసింది. శిక్ష పేరుతో టీచర్ తన వేళ్ళ మధ్య పెన్ను పెట్టి గట్టిగా నొక్కేవారని ఆరోపించింది.
టీచర్ తరచుగా తను బెంచ్ మీద కూర్చున్నప్పుడు తన చేతిని పట్టుకుని తన చేయి ఎంత చల్లగా ఉందో చెప్పేవారని విద్యార్థిని సూసైడ్ నోట్ లో పేర్కొంది. అసభ్యంగా ప్రవర్తించేవాడని రాసుకొచ్చింది. ఇంట్లో తమ అమ్మాయి చాలా సాధారణంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్కూల్లో ఎవరో తమ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారని వారు ఆరోపించారు. తమ కూతురి కాల్ వివరాలు పరిశీలించాలని పాఠశాలకు సంబంధించిన అన్ని అంశాలపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ సింగ్ తెలిపారు. టీచర్ వేధింపులపై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. దర్యాప్తు పూర్తయితే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ALSO READ: Ashwagandha: ప్రతిరోజూ చిటికెడు అశ్వగంధ తీసుకుంటే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు