Farmers Relief: స్వేచ్ఛ బ్యూరో: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడలో బుల్లెట్ ట్రైన్ కోసం భూములు సేకరించే వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు నలుగురు రైతులకు భారీ ఊరటనిచ్చింది. వివాదాస్పద సర్వే నంబర్లు 3, 4 పరిధిలోని 28 ఎకరాల భూమి తమదని, గత 30 ఏళ్లుగా తామే సాగు చేసుకుంటున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ఆదేశాలు..
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు సదరు భూముల విషయంలో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఆ భూములు పిటిషనర్లవి కావని చెప్పారు. రైతులు చూపిస్తున్న పట్టాదారు పాస్ పుస్తకాలపై అధికారుల సంతకాలు లేవన్నారు.
భూమల విషయంలో ఎలాంటి చర్యలు వద్దు..
ప్రభుత్వం కేవలం సర్వే నెంబర్లు 28, 62లోని ప్రభుత్వ భూములకు మాత్రమే ఫెన్సింగ్ వేసినట్టు తెలిపారు. పిటిషనర్లు పేర్కొన్న 3, 4సర్వే నెంబర్లలోని భూముల జోలికి ప్రభుత్వం, అధికారులు వెళ్లలేదని చెప్పారు. కాగా, పిటిషనర్ల తరపు న్యాయవాదులు ఆ భూములు పిటిషనర్లవే అని వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు ఆ భూముల విషయంలో ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
బుల్లెట్ ట్రైన్ హబ్కి బ్రేక్..?
బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం సర్వే నెంబర్ 28 లోని 150 ఎకరాలు, సర్వే నెంబర్ 62 లోని 500 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సరైన పరిహారం, పునరావాసం లేకుండా అధికారులు హడావిడిగా కంచెలు వేయడంతో గత ఐదు రోజులుగా బహదూర్ గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులు కొందరు పోలీసులపై కారం, రాళ్లతో దాడులు కూడా చేశారు. ఈ క్రమంలో 32మందిపై కేసులు నమోదు కాగా కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లోనే నలుగురు రైతులు సోమవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
Also Read:ఆక్వా కల్చర్ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!