Cancer : ఒకప్పుడు క్యాన్సర్ అంటే కేవలం వృద్ధులకు లేదా 50 ఏళ్లు పైబడిన వారికి వచ్చే వ్యాధిగా భావించేవారు. కానీ.. గత కొన్నేళ్లుగా పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత తరం యువతలో.. ముఖ్యంగా జెడ్-జెన్ (Gen Z) ,మిలీనియల్స్ లో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య భయంకరంగా పెరుగుతోంది. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు, ప్యాంక్రియాటిక్ వంటి క్యాన్సర్లు ముప్పై ఏళ్ల లోపు వారికే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. మన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులు ఈ పెను ముప్పుకు ఎలా కారణమవుతున్నాయో శాస్త్రీయంగా ఇప్పుడు తెలుసుకుందాం.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత తరం యువతలో క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ, ‘ది లాన్సెట్’ వంటి అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం.. 50 ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ బారిన పడే అవకాశం 1990ల తర్వాత జన్మించిన వారిలో ఎక్కువగా ఉంది.
సంఖ్యలు చెబుతున్న భయంకరమైన సత్యాలు ముఖ్యంగా.. మహిళల్లో 50 ఏళ్ల లోపు క్యాన్సర్ కేసులు పురుషుల కంటే 82% ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. న్యూజిలాండ్, స్వీడన్, స్కాట్లాండ్ వంటి దేశాలతో పాటు మన మన దేశంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. పెద్దపేగు క్యాన్సర్ కేసులు గతంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు అయ్యాయి. 1950లో జన్మించిన వారితో పోలిస్తే.. 1990లో పుట్టిన వారికి ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని హార్వర్డ్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకిలా జరుగుతోంది?
మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ యువత ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్ , చక్కెర అధికంగా ఉండే డ్రింక్స్ తీసుకుంటున్నారు. పీచు పదార్థం తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతిని పేగు క్యాన్సర్లకు దారితీస్తోంది.
అధిక బరువు: క్యాన్సర్ పెరగడానికి ఊబకాయం ఒక ముఖ్య కారణం. శరీరంలో అనవసరమైన కొవ్వు పెరగడం వల్ల అవయవాలలో దీర్ఘకాలిక వాపు ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కణాలు పెరగడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తుంది.
పర్యావరణ కాలుష్యం: మనం పీల్చే గాలి, తాగే నీటిలో ఉండే మైక్రో ప్లాస్టిక్స్, ఇతర టాక్సిన్స్ యువతలో క్యాన్సర్ రిస్క్ పెంచుతున్నాయి.
అలవాట్లు: మద్యపానం, ధూమపానం చిన్న వయసులోనే ప్రారంభించడం వల్ల శరీరంలోని కణజాలం వేగంగా దెబ్బతింటోంది.
ముందస్తు గుర్తింపు, అవగాహన కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు స్క్రీనింగ్, టెస్టులు పెరగడం వల్ల కూడా ఈ కేసులు బయటపడుతున్నాయి. కానీ అది కేవలం కొంత భాగం మాత్రమే. మిగిలినదంతా మన అలవాట్ల వల్లే జరుగుతోందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ప్యాంక్రియాస్ , చిన్న పేగు క్యాన్సర్ కేసులు కూడా గతంలో కంటే వేగంగా పెరుగుతున్నాయి.
Also Read: మిలియన్ల మందిని బలితీసుకుంటున్న వ్యాధి.. కాళ్లలో కనిపించే ఈ లక్షణాలే మొదటి వార్నింగ్!
మనం ఏం చేయాలి?
క్యాన్సర్ అనేది వృద్ధులకు మాత్రమే వచ్చే వ్యాధి అనే భ్రమలో ఉండటం ప్రమాదకరం. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక వ్యాయామం చేయడం, అనారోగ్య లక్షణాలు ఏవైనా కనిపిస్తే.. వెంటనే డాక్టరును సంప్రదించడం వంటివి మనల్ని ఈ మహమ్మారి నుంచి రక్షిస్తాయి.
క్యాన్సర్ రేట్లు పెరగడం అనేది కేవలం మెడికల్ సమస్య కాదు. ఇది సామాజిక సమస్య. మన అలవాట్లను మార్చుకోకపోతే.. 2030 నాటికి 50 ఏళ్ల లోపు వారిలో మరణాలకు ప్రధాన కారణం క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మేల్కోవలసిన సమయం ఇదే.