Hot Weather and Stomach: వేసవి కాలం రాగానే మనల్ని కేవలం చెమటలు మాత్రమే కాదు. రకరకాల కడుపు సంబంధిత సమస్యలు కూడా వేధిస్తాయి. బయట ఎండ తక్కువగా ఉన్నప్పుడు బాగానే తిన్న మన పొట్ట, ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటగానే ఎందుకు మొరాయిస్తుంది? చాలా మందికి ఎండలో తిరిగితే వికారం రావడం లేదా తిన్నది అరగకపోవడం వంటివి జరుగుతుంటాయి. దీనినే మనం ‘సమ్మర్ స్టమక్ బగ్’ అని కూడా అంటుంటాం. లేటెస్ట్ హెల్త్ అప్డేట్స్ ప్రకారం.. మన శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో జీర్ణవ్యవస్థపై చూపే ప్రభావమే దీనికి ప్రధాన కారణం. ఈ వేడి వాతావరణం మన కడుపును ఎందుకు అప్సెట్ చేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
వేడి వాతావరణం జీర్ణక్రియను ఎందుకు దెబ్బతీస్తుంది?
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం. బయట వేడి పెరిగినప్పుడు అది తనను తాను చల్లబరుచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ ప్రక్రియలో జరిగే కొన్ని మార్పులు ఇవే..
1. రక్త ప్రసరణలో మార్పు :
సాధారణంగా మనం భోజనం చేసినప్పుడు.. ఆహారాన్ని అరిగించడానికి జీర్ణవ్యవస్థకు ఎక్కువ రక్తం అవసరం అవుతుంది. కానీ వేడి వాతావరణంలో.. శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి రక్తాన్ని చర్మం వైపు మళ్లిస్తుంది (దీనివల్లనే మనం చెమటలు పట్టి చల్లబడతాం). ఇలా రక్తం జీర్ణవ్యవస్థ నుంచి చర్మం వైపు వెళ్లడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. ఫలితంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
2. డీహైడ్రేషన్:
వేసవిలో చెమట రూపంలో నీరు, ఉప్పు బయటకు పోతాయి. మన కడుపులో ఆహారం సజావుగా కదలడానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గితే.. పేగుల కదలికలు మందగించి మలబద్ధకం లేదా కడుపునొప్పికి దారి తీస్తుంది.
3. బ్యాక్టీరియా పెరుగుదల:
వేడి వాతావరణం బ్యాక్టీరియా వృద్ధికి అనుకూలం. వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది. ఒకవేళ మనం బయట సరిగ్గా నిల్వ చేయని ఆహారం తింటే.. అది ‘ఫుడ్ పాయిజనింగ్’ కు దారితీసి వాంతులు, విరేచనాలు కలిగిస్తుంది.
4. ఆకలి తగ్గడం:
తీవ్రమైన వేడి వల్ల మన మెదడులోని ‘హైపోథాలమస్’ ఆకలిని తగ్గిస్తుంది. ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియలో శరీరంలో వేడి పుడుతుంది. ఇప్పటికే బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరం మరిన్ని కేలరీలను దహించి వేడిని పెంచుకోవడానికి ఇష్టపడదు. అందుకే ఎండలో మనకు కేవలం నీళ్లు తాగాలనిపిస్తుంది కానీ తినాలనిపించదు.
జీర్ణ సమస్యల నుంచి బయటపడటం ఎలా ?
వేసవిలో మీ కడుపు ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ చిన్న మార్పులు చేయండి.
ద్రవ పదార్థాలు పెంచండి: కేవలం దాహం వేసినప్పుడే కాకుండా.. రోజంతా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం తాగుతూ ఉండాలి. ఇవి ఎలక్ట్రోలైట్లను భర్తీ చేస్తాయి.
తక్కువ భోజనాలు: ఒకేసారి ఎక్కువగా తినేయకుండా.. రోజులో 4-5 సార్లు కొద్ది కొద్దిగా తినండి. దీని వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది.
నీటి శాతం ఉన్న ఆహారం: పుచ్చకాయ, దోసకాయ, పెరుగు వంటి చలవ చేసే పదార్థాలను డైట్లో చేర్చుకోండి.
స్పైసీ ఫుడ్స్ వద్దు: కారం, మసాలాలు, వేయించిన పదార్థాలు శరీర వేడిని మరింత పెంచుతాయి. వేసవిలో వీటికి దూరంగా ఉండటమే బెస్ట్.
పరిశుభ్రత: పండ్లు, కూరగాయలను బాగా కడిగి వాడండి. బయట దొరికే కట్ చేసిన పండ్లను తినకపోవడమే మంచిది.