old indian homes: మనకు తెలీకుండా మన పెద్దలు చాలా పనులు చేసేవారు. ఆ రోజుల్లో పెద్దగా చదువు లేకపోయినా రకరకాల పద్దతులు ఉపయోగించేవారు. ఇప్పటికీ చాలా గ్రామాలను మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇంటి గోడలపై అందమైన చిత్రాలు, సున్నం పూతతో ఎంతో మనోహరంగా ఉంటాయి. ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి చాలామంది భావించేవారు. కానీ దాని వెనుక లోతైన కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ విషయం మీకు తెలుసా?
వేడిమి నుంచి ఉపశమనం-దేశంలోని వేసవికాలం గురించి అందరికీ తెలుసు. మార్చి మొదలుకుని భానుడు తీవ్ర ప్రతాపం చూపుతాడు. ఇప్పుడు డాబాలు కట్టుకున్నా ఎండ వేడిమికి తట్టుకోలేపోతున్నారు. ఆ రోజుల్లో అలాంటిదేమీ లేదు. పూరిళ్లు లేకుంటే గడ్డి ఇళ్లు మాత్రమే ఉండేవి. కాకపోతే గోడలు చాలా అందంగా ఉండేవి. వాటికి తెలుపు-ఎరుపు రకరకాల రంగులు వేసేవారు. ఎక్కువగా తెలుపు రంగు గోడలకు కనిపించేది. తెలుపు రంగు సూర్యుని ప్రచండ కిరణాలను గ్రహించకుండా ప్రతిబింబిస్తుంది. సున్నం చల్ల దనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. మందపాటి మట్టి గోడలకు తెల్ల సున్నం పూసేవారు. వేడిని ఇంటిలోకి చొరబడకుండా నిరోధించింది. అందుకే మండుటెండలో ఆ ఇంటి లోపల చల్లగా ఉండేది.
కీటకాలు-వ్యాధుల నుండి రక్షణ- మట్టి ఇళ్లలో కీటకాలు, సాలీలు, బల్లులు, దోమలు ఎక్కువగా ఉండేవి. తెల్ల సున్నానికి యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా సున్నం వాసన, దాని రసాయన గుణాల వల్ల కీటకాలు ఆ గోడలకు దూరంగా ఉండేవి. ఆ కాలంలో ఇది అత్యంత చవకైన, అత్యంత ప్రభావ వంతమైన కీటకాలను నివారించే పద్ధతి.
ఎర్ర రంగు రహస్యం అదే- ఇంటి గోడలకు తెలుపు ఎర్రమట్టి రంగు వేసేవారు. ఐరన్ ఆక్సైడ్ అధికంగా ఉండే ఓ ప్రత్యేక రకమైన ఎర్ర మట్టి. వర్షాకాలంలో నీరు నేలను తాకి గోడల కింది భాగాలపై పడినప్పుడు ఆ మట్టి కోతకు గురయ్యే అవకాశం ఉండేది. అది నీటిని పీల్చుకోకుండా నిరోధించడానికి ఆ రంగు వేసేవారు. దీనివల్ల మట్టిని గట్టిగా పట్టి ఉంచుతుంది. ఒక విధంగా చెప్పాలంటే గోడలకు జల నిరోధక కారకంగా పని చేస్తుంది.
ఇప్పుడు క్రాక్స్.. అప్పుడు పగుళ్లు- ప్రతి ఏడాది దీపావళి లేకుంటే సంక్రాంతికి ముందు మహిళలు తమ ఇళ్లకు సున్నం వేసేవారు. కేవలం శుభ్రత మాత్రమే కాదు ఇది ఒక రకమైన ఇంటి మరమ్మత్తు. వర్షాకాలం తర్వాత గోడల్లో ఏర్పడిన పగుళ్లను సున్నం పూయడం ద్వారా వాటిని పూడ్చేవారు. ఆ విధంగా మట్టి ఇళ్లు సంవత్సరాల పాటు పటిష్టంగా ఉండేవి.
ALSO READ: బిర్యానీ డెలివరీకి వెళ్తే.. సీఈఓ కుర్చీలో కూర్చోబెట్టారు.. ఆ తర్వాత ఏమైందంటే?
ఈ ప్రయోజనాలతో పాటు మానసిక, మతపరమైన కోణం ఉండేదని చెబుతున్నారు పెద్దలు. కాషాయపు లేదా ఎరుపు రంగు శుభప్రదంగా చెబుతారు. జీవానికి ప్రతీకగా వర్ణిస్తుంటారు. తెలుపు రంగు శాంతి-స్వచ్ఛతకు ప్రతీక. ఈ రెండు రంగుల కలయిక వల్ల ఆ ఇంట్లో సానుకూలమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని గొప్ప నమ్మకం. పల్లెటూరిలో మట్టి ఇంటిపై సున్నం, రకరకాల రంగుల చిత్రాలు వేస్తే కేవలం డిజైన్లుగా భావించకండి. మన పెద్దల జ్ఞానానికి సజీవ నిదర్శనం.