Panchayat Funds:తెలంగాణలో గ్రామ పంచాయతీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల సొంత ఆదాయాన్ని ఎక్కడ జమ చేయాలనే విషయంలో కొత్త మార్పు తీసుకువచ్చేందుకు సిద్దమైంది.దీనికి సంబంధించిన పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణ బిల్లును మంత్రి సీతక్క రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ట్రెజరీలో జమ చేస్తున్నారు. ఇకపై ఈ డబ్బును పంచాయతీకి దగ్గర్లో ఉన్న నేషనల్ బ్యాంకులో జమ చేసుకునేలా చట్టంలో మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం ఆ డబ్బు ట్రెజరీలో ఉండటంతో
సాధారణంగా గ్రామ పంచాయతీలకు పన్నుల ద్వారా ఆదాయం వస్తుంటుంది. ఈ డబ్బును గ్రామంలో స్ట్రీట్ లైట్లని బాగుచేయడానికి, గ్రామాలని శుభ్రం చేయడానికి ,తాగే నీటిని సరఫరా చేయడానికి చిన్నచిన్న మరమ్మతులు ఏమైనా ఉంటె వాటికి వాడుతుంటారు.అయితే ప్రస్తుతం ఆ డబ్బు ట్రెజరీలో ఉండటంతో అవసరమైనప్పుడు ఖర్చు చేయడంలో కొంత ఇబ్బంది ఉంటోందని భావిస్తోంది ప్రభుత్వం
ఇక కొత్త సవరణతో పంచాయతీల సొంత డబ్బు బ్యాంకులోనే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామానికి అవసరమైన పనులు ఉన్నప్పుడు నిధులను ఉపయోగించుకోవడం సులభం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఆడిట్ చేసే అవకాశం కూడా
అయితే బ్యాంకులో డబ్బు ఉంచుకునే అవకాశం వచ్చినా, ఆ నిధులను ఎలా ఖర్చు చేయాలి, ఎవరి అనుమతి తీసుకోవాలి, లెక్కలు ఎలా నిర్వహించాలి అనే విషయాలపై రేపు సీతక్క వెల్లడించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక పంచాయతీ డబ్బు దుర్వినియోగం కాకుండా ఆడిట్ చేసే అవకాశం కూడా ఉంటుందని సమాచారం.
ఏది ఏమైనా రేపు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సవరణ బిల్లుకి అందరు ఆమోదం చెబితే గ్రామ పంచాయతీల నిర్వహణలో కొత్త విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ALSO READ:మట్టి గణపయ్యను ఇంటికి తీసుకెళ్లండి.. హెచ్ఎండీఏ బంపర్ ఆఫర్
పంచాయతీలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో
మొత్తానికి ఇప్పటివరకు ట్రెజరీలో జమ అవుతున్న పంచాయతీల సొంత డబ్బును ఇకపై సమీపంలోని నేషనల్ బ్యాంకులో జమ చేసుకునేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. చూడాలి ఈ మార్పు గ్రామ పంచాయతీలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో!