Aamani: తెలుగు చిత్ర పరిశ్రమలో ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’ వంటి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకుల మనస్సులలో చెరగని ముద్ర వేసిన సీనియర్ నటి ఆమని. ప్రస్తుతం ఆమె బుల్లితెర సీరియల్స్తో చాలా బిజీగా గడుపుతున్నారు. గతం లో ఒక ఇంటర్వ్యూలో ఆమని పాల్గొని, తన సినీ ప్రస్థానం మరియు తోటి నటీమణులైన రోజా, సౌందర్యలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ‘శుభలగ్నం’ సినిమా సమయంలో రోజా పాత్రను చూసి తాను ఎలా ఆందోళన చెందానో చెప్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ..
‘శుభలగ్నం’ కథ విన్నప్పుడు రోజా పోషించిన ధనిక అమ్మాయి లతా క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ మరియు స్టైలిష్గా అనిపించిందట. ఇక దాంతో ఆ పాత్ర తనను ఎక్కడ డామినేట్ చేస్తుందోనని ఆమని కాస్త ఆందోళన చెందారట. హీరోయిన్గా తనకు దక్కాల్సిన పేరు మొత్తం రోజాకే వెళ్ళిపోతుందేమోనని భయపడి , కాస్త హర్ట్ కూడా అయ్యారట.
ఈ విషయాన్ని ఆమని వెంటనే దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారట. దానికి ఆయన నవ్వుతూ ఆమనికి ధైర్యం చెప్పారు. “రోజా క్యారెక్టర్ బలంగా ఉన్నా, కథ ప్రధానంగా నీ రాధ పాత్రపై నడుస్తుంది. సినిమా రిలీజ్ అయ్యాక నీ నటనకే ఎక్కువ గుర్తింపు వస్తుంది” అని ఆయన భరోసా ఇచ్చారుట.
సినిమా థియేటర్లలోకి వచ్చాక దర్శకుడు చెప్పినట్లే ఆమని నటనకు, రాధ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో రోజా కూడా తన పాత్రలో చాలా చక్కగా నటించి మెప్పించిందని ఆమని కొనియాడారు. ఇక ఈ సినిమా వీరిద్దరి మధ్య మంచి స్నేహాన్ని చిగురించేలా చేసింది. ఇప్పటికీ తాము మంచి స్నేహితులమని ఆమె తెలిపారు.
ఇటీవల ఓ సందర్భం లో ‘శుభలగ్నం’నాటి పాత ఫోటోలను రోజా తనకు పంపించారని, ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండనిపించిందని ఆమని ఆనందం వ్యక్తం చేశారు. ఒకవేళ అవకాశం ఉండి ‘శుభలగ్నం 2’ తీస్తే, మళ్ళీ జగపతి బాబు, రోజా, తాను కలిసి నటిస్తే చాలా బాగుంటుందని తన మనసులోని ఆశను బయటపెట్టారు.
ఇక ఎంతోమంది హీరోయిన్లు పోటీ పడే ఆ కాలంలో కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో సినిమాలు తీశారని ఆమని మాటల ద్వారా అర్థమవుతోంది. భయాలు, ఆందోళనలు ఉన్నప్పటికీ పాత్రలోని ప్రాధాన్యతను గుర్తించి నటించడం వల్లే ‘శుభలగ్నం’ క్లాసిక్గా నిలిచింది. ఇక మరి వీరి కాంబినేషన్లో సీక్వెల్ వస్తే చూడాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.