Actor Shivaji : నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. మహిళా కమిషన్ నోటీసులు, సోషల్ మీడియాలో విమర్శల నేపథ్యంలో ఆయన మరోసారి స్పందిస్తూ తన మనసులోని మాటలను బయటపెట్టారు.తాను చేసిన వ్యాఖ్యల్లో రెండు పదాలు దొర్లాయని, వాటి పట్ల తాను ఎంతో బాధపడుతున్నానని శివాజీ పేర్కొన్నారు.
అసలు శివాజీ ఏమన్నారు?
నేను ఎవరినీ తక్కువ చేసి మాట్లాడాలని అనుకోలేదు. కానీ ఆ సమయంలో తెలియకుండానే రెండు తప్పు పదాలు వాడాను. ఆ ఈవెంట్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 36 గంటల నుంచి నిద్ర కూడా పోకుండా అదే అంతర్మథనంలో ఉన్నానని శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రమ్యకృష్ణ, జయసుధ, సౌందర్య వంటి నటీమణులు చీరకట్టులో ఉండి కూడా కోట్ల మంది అభిమానాన్ని సంపాదించుకున్నారని, ఆ ఉద్దేశంతోనే తాను మాట్లాడానని చెప్పుకొచ్చారు.
గరికపాటి, చాగంటిలను ప్రస్తావిస్తూ..
తనపై వస్తున్న విమర్శలపై శివాజీ సూటిగానే స్పందించారు. ప్రవచనకర్తలు గరికపాటి , చాగంటి కూడా మహిళల వస్త్రధారణ గురించి ఎన్నోసార్లు చెప్పారు. అప్పుడు స్పందించని వారు ఇప్పుడు నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. సమాజంలో ఏ తప్పు జరిగినా సినీ పరిశ్రమనే వేలెత్తి చూపుతారని, అందుకే బాధ్యతగా ఉండాలన్న ఉద్దేశంతోనే అలా మాట్లాడానని క్లారిటీ ఇచ్చారు.
అనసూయ, చిన్మయిల ట్యాగులపై స్పందన
తన వ్యాఖ్యలపై అనసూయ, చిన్మయి వంటి వారు స్పందించిన తీరుపై కూడా శివాజీ మాట్లాడారు. కొందరు కావాలనే వారికి ట్యాగ్ చేసి వివాదాన్ని పెద్దది చేస్తున్నారని, కనీసం ఒక్కరైనా తనతో మాట్లాడి సారీ చెప్పమని అడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మహిళా కమిషన్, సీఎంలు, పోలీసులకు తనను ట్యాగ్ చేయడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
మహిళా కమిషన్ నోటీసులు
ఇప్పటికే మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న శివాజీ, ఈ నెల 27న కమిషన్ ముందు హాజరై తన వివరణ ఇస్తానని చెప్పారు. తప్పు నా వైపు ఉన్న ఆ రెండు పదాలకు మాత్రమే నేను క్షమాపణలు చెబుతున్నానని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల నిధి అగర్వాల్, సమంతలకు ఎదురైన చేదు అనుభవాలను చూసి చలించిపోయి, సమాజంలో మహిళల పట్ల గౌరవం పెరగాలన్న కోణంలోనే తన మాటలు సాగాయని వివరణ ఇచ్చారు.