Anant Sriram: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా పేరు తెచ్చుకున్న అనంత శ్రీరామ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారాయి. ముఖ్యంగా “సరస్వతీ పుత్ర” అనే బిరుదుపై ఆయన చెప్పిన అభిప్రాయం వివాదానికి కారణమైంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్ను “సరస్వతీ పుత్ర” అని సంబోధించారు. దీనికి ఆయన స్పందిస్తూ తాను సరస్వతీ పుత్రుడు కాదని, తాను “పావనీ పుత్రుడు” అని అన్నారు. “సరస్వతీ పుత్రుడు” అని పిలిపించుకోవడం చాలా గొప్ప విషయం అని, ఆ స్థాయికి చేరాలంటే అసాధారణమైన ప్రతిభ ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన అభిప్రాయం ప్రకారం, మహాకవి శ్రీశ్రీ లాంటి గొప్ప రచయితలే ఆ బిరుదుకు నిజంగా అర్హులు అని చెప్పారు.
ఈ వ్యాఖ్యల తర్వాత టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రిని చాలా కాలంగా “సరస్వతీ పుత్ర” అని పిలుస్తుంటారు. చాలా సినిమాల్లో టైటిల్ కార్డులో కూడా “సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి” అని చూపిస్తారు. దీంతో అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించి చేసినవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ విషయంపై మరికొందరు వేరే కోణంలో కూడా మాట్లాడుతున్నారు. రామజోగయ్య శాస్త్రి తల్లి పేరు సరస్వతమ్మ అని చెబుతారు. అందుకే ఆయన తన పేరుతో పాటు “సరస్వతీ పుత్ర” అనే బిరుదును ఉపయోగిస్తున్నారని అంటున్నారు. ఈ కారణంగా అది వ్యక్తిగతంగా వచ్చిన బిరుదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక భాషపై మంచి పట్టు, రచనలో ప్రత్యేకత ఉన్నవారిని కూడా సాధారణంగా “సరస్వతీ పుత్రుడు” అని అభివర్ణించడం మనం చూస్తుంటాం. ఆ దృష్టిలో చూస్తే రామజోగయ్య శాస్త్రి కూడా ఆ బిరుదుకు అర్హుడే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పైన అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారి తీసాయి. ఈ వివాదం ఇకపై ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.
ALSO READ: Khushboo: నా మొహం చూసి నేనే భయపడ్డా.. ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి 4 ఏళ్లు పట్టింది: ఖుష్బూ