Ayesha Khan Reaction: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక స్టాండప్ కామెడీ వీడియో ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. డేటింగ్కు వెళ్లినప్పుడు అమ్మాయి తిన్న ‘రూ. 370 చికెన్ బిర్యానీ’ బిల్లు కట్టానని, దానికి బదులుగా ఆమె శరీరంపై తనకు హక్కు ఉందనేలా ఒక యువకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘ధురంధర్’ ఫేమ్, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ ఆయేషా ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసలు వివాదం ఏంటి?
స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే నిర్వహించిన ఒక షోలో ప్రేక్షకులతో మాట్లాడే విభాగంలో ఈ ఘటన జరిగింది. గురుగ్రామ్కు చెందిన ఒక 23 ఏళ్ల యువకుడు తాను వెళ్లిన ఒక డేటింగ్ అనుభవాన్ని పంచుకుంటూ.. ఒక అమ్మాయితో డేట్కు వెళ్లినప్పుడు ఆమె రూ. 370 విలువైన చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసిందని, ఆ బిల్లు తనే కట్టానని చెప్పాడు. అంతటితో ఆగకుండా.. “ఆమె కోసం రూ. 370 ఖర్చు పెట్టాను కాబట్టి, ఆ డబ్బును ఏదో ఒక రకంగా వసూలు చేసుకోవాలి కదా” అనే అర్థం వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ యువకుడు అలా మాట్లాడుతుంటే హాల్లో ఉన్న పురుషులతో పాటు షో హోస్ట్ ప్రణిత్ మోరే కూడా గట్టిగా నవ్వారు. ఈ క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది పురుషాధిక్య ఆలోచనా విధానమని నెటిజన్లు ధ్వజమెత్తారు.
ఆయేషా ఖాన్ ఘాటు స్పందన
ఈ వైరల్ వీడియోపై నటి ఆయేషా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఘాటుగా స్పందించారు. “ఆ రూమ్లో ఉన్న ప్రతి మగాడు నవ్వుతున్న తీరు చూస్తుంటేనే భయమేస్తోంది. అసలు ఈ రీల్ను పోస్ట్ చేసే ముందు దీని గురించి ఆలోచించారా? నువ్వు ఒక డేట్కి వెళ్లావు, అక్కడ రూ. 370 ఖర్చు పెట్టావు… అంతమాత్రానికే ఆ అమ్మాయి శరీరంపై నీకు హక్కు వచ్చేసిందని అనుకుంటున్నావా? అసలు మనం ఎటు వెళ్తున్నాం? ఏమైంది మన సమాజానికి?” అంటూ ఆమె ప్రశ్నించారు.
క్షమాపణలు చెప్పిన కమెడియన్
ఈ వీడియోపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో కమెడియన్ ప్రణిత్ మోరే స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో ఆ వ్యాఖ్యను ఖండించకుండా, నవ్వి వదిలేయడం తన జడ్జిమెంట్లో జరిగిన లోపమని, ముమ్మాటికీ తన తప్పేనని ఆయన ఒప్పుకున్నారు. ఇటీవలే రణవీర్ సింగ్, సంజయ్ దత్ వంటి స్టార్ హీరోలతో విడుదలైన భారీ బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ లోని ‘షరారత్’ సాంగ్తో ఆయేషా ఖాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.