Megastar: స్వయంకృషితో ఎదిగి ‘మెగాస్టార్’ స్థాయికి చేరుకున్న చిరంజీవి ప్రయాణం పూల బాట ఏమీ కాదు. కెరీర్ ఆరంభంలో ఆయన ఎన్నో అవమానాలను, వెన్నుపోట్లను ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ఒక అగ్ర నిర్మాణ సంస్థ చిరంజీవిని ఎలా మోసం చేసిందో తెలిస్తే మెగా ఫ్యాన్స్ షాక్ అవ్వాల్సిందే!
ఆ అగ్ర సంస్థ పెట్టిన వింత కండిషన్
అప్పట్లో ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ వంటి ఇండస్ట్రీ హిట్లను నిర్మించి, టాలీవుడ్లో తిరుగులేని పవర్హౌస్గా వెలుగొందుతోంది సత్యచిత్ర నిర్మాణ సంస్థ. ఆ సంస్థ అధినేతల్లో ఒకరైన సూర్యనారాయణ ఒకరోజు చిరంజీవిని పిలిపించారు. చిరు ఎదుగుదలను గమనించిన ఆయన, ‘మా బ్యానర్లో నిన్ను సోలో హీరోగా పెట్టి ఒక భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాం.. కానీ దానికి ముందు ఒక చిన్న కండిషన్’ అని చెప్పారు.ఆ కండిషన్ ఏంటంటే.. అప్పటికే సూపర్ స్టార్ కృష్ణ గారితో వాళ్లు నిర్మిస్తున్న ‘కొత్త అల్లుడు’ సినిమాలో చిరంజీవి విలన్గా నటించాలి అని.
హీరో అవ్వాలనే కోరిక.. విలన్ వేషానికి ఓకే
అప్పటికే చిరంజీవి కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేశారు. అయితే, ఇకపై విలన్ వేషాలు వేయకూడదని, కేవలం హీరోగానే నిలదొక్కుకోవాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. కానీ, సత్యచిత్ర వంటి పెద్ద బ్యానర్లో హీరోగా ఛాన్స్ అంటే కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరుగుతుందని భావించిన చిరు, ఆ నిర్మాత మాటను నమ్మారు. తన నిర్ణయాన్ని పక్కన పెట్టి మరీ ‘కొత్త అల్లుడు’ సినిమాలో విలన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మొదటి దెబ్బ: మాట తప్పిన నిర్మాత
‘కొత్త అల్లుడు’ విడుదలై ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలో చిరంజీవి విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక తనతో సినిమా అనౌన్స్ చేస్తారని చిరంజీవి వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. కానీ, సూర్యనారాయణ గారు మాత్రం మళ్లీ కృష్ణ, జయప్రదల కాంబినేషన్లోనే మరో సినిమా ప్రకటించి చిరంజీవికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చారు.దీనిపై చిరంజీవి వెళ్లి అడిగితే.. ‘ఈ సినిమా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది ఖచ్చితంగా నీతోనే సినిమా ఉంటుంది. అయితే ఇప్పుడు మేము చేస్తున్న ‘కొత్తపేట రౌడీ’ సినిమాలో ఒక మంచి గెస్ట్ రోల్ ఉంది. అది విలన్ పాత్ర కాదు.. నీకు ఒక సాంగ్ కూడా ఉంటుంది.. అది నువ్వే చేయాలి’ అని మళ్లీ కొత్త ఆశ చూపారు.
రెండో దెబ్బ: మొహమాటానికి పోయి.. మునిగిపోయి
నిజానికి అప్పటికే చిరంజీవి హీరోగా రెండు సినిమాల్లో నటిస్తున్నారు. హీరోగా చేస్తూ మళ్లీ గెస్ట్ రోల్స్ చేయడం ఆ సినిమాల నిర్మాతలకు ఇష్టం లేదు. కానీ, సత్యచిత్ర సంస్థకు ఇచ్చిన మాట కోసం, హీరో ఛాన్స్ వస్తుందన్న నమ్మకంతో చిరంజీవి ఇతర నిర్మాతలను బ్రతిమిలాడి ఒప్పించి మరీ ‘కొత్తపేట రౌడీ’లో నటించారు. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. కానీ ఆ తర్వాత కూడా సత్యచిత్ర సంస్థ నుంచి చిరంజీవికి ఎలాంటి పిలుపు రాలేదు.
గుండె కోత.. కానీ నిశ్శబ్ద పోరాటం
తనను కేవలం స్టార్ హీరోల సినిమాలకు వెయిటేజ్ పెంచడానికే వాడుకున్నారని, హీరో ఆఫర్ అనేది కేవలం ఒక ఎర మాత్రమేనని చిరంజీవికి ఆలస్యంగా అర్థమైంది. ఆ నిర్మాత చేతిలో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన చిరు, ఎంతో కుమిలిపోయారు. కానీ ఆ బాధను ఎవరికీ చెప్పుకోకుండా, తన కృషినే నమ్ముకుని ముందుకు సాగారు. ఆ కసి, ఆ ఆవేదనే ఆయనను మెగాస్టార్గా మార్చాయి.
నాడు చిరంజీవిని నమ్మించి వంచించిన సంస్థలు కాలక్రమేణా కనుమరుగయ్యాయి.. కానీ, నాడు మోసపోయిన ఆ కుర్రాడు మాత్రం నేడు భారతీయ సినీ చరిత్రలోనే తిరుగులేని మహావృక్షంగా నిలిచారు.దటీజ్ చిరంజీవి.
read also: రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న త్రిష.. పొత్తులో కీలకం కానుందా?