Director Teja:సైబర్ మోసగాళ్లు ప్రజలను ఏ రేంజ్ లో మోసం చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మన బంధువుల లాగే.. మనకు తెలిసిన వాళ్ళలాగే మాట్లాడుతూ డబ్బులు కాజేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు డబ్బు ఆశ చూపించి మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఆశ చూపిస్తూ పలు లింకుల ద్వారా అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తాన్ని ఖాళీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సైబర్ మోసగాళ్ల చేతుల్లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సైబర్ మోసగాళ్ల చేతిలో డైరెక్టర్ కొడుకు మోసపోయారని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇకపోతే ఆ డైరెక్టర్ ఎవరు? సైబర్ మోసగాళ్ల దృష్టిలో పడడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
ఆయన ఎవరో కాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న తేజ..ఆయన కుమారుడు అమితవ్ తేజ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతోనే ఇప్పుడు భారీ మోసానికి గురయ్యారు. లాభాలు వస్తాయని ఆశతో ఏకంగా 63 లక్షలు కోల్పోయారు. విషయంలోకి వెళ్తే.., హైదరాబాదులోనే మోతీనగర్ కు చెందిన యార్లగడ్డ అనూష కొండపునేని ప్రణీత్ అనే దంపతులతో అమితవ్ తేజకు గత ఏడాది పరిచయం ఏర్పడింది. ముఖ్యంగా ఆ దంపతులు అమితవ్ తో పరిచయం పెంచుకొని.. స్టాక్ మార్కెట్, ఆన్లైన్ ట్రేడింగ్ లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బు పొందవచ్చని నమ్మబలికారు.
అక్కడితో ఆగకుండా నష్టం వస్తే తమ ఫ్లాట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో.. ఆ దంపతులు మాయపు మాటలు నమ్మిన అమితవ్ విడతలుగా పెద్ద మొత్తంలో వారికి డబ్బులు బదిలీ చేశారు. అయితే వారం రోజుల తర్వాత తొమ్మిది లక్షలు లాభం వచ్చిందని నిందితులు నకిలీ పత్రాలను చూపించడంతో అమితవ్ మరింత డబ్బును పెట్టుబడిగా పెట్టాడు. ఇక ఆ తర్వాత రోజులు గడిచినా లాభం రాలేదు. ఈ లాభాలు ఇవ్వకపోగా అసలు డబ్బును కూడా తిరిగి ఇవ్వకూడదని నిందితులు కాలయాపన చేశారు. చివరికి ఫోన్ నెంబర్లు మార్చి పరారవడంతో మోసపోయానని తెలుసుకున్న అమితావ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఈ దంపతులపై ఫిర్యాదు చేశారు. అమితవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటి యాక్ట్ , చీటింగ్ కేసు కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.
ఇకపోతే డైరెక్టర్ తేజ కొడుకు ఇలా సైబర్ మోసగాళ్ల చేతుల్లో చిక్కి మోసపోయారని తెలియడంతో అభిమానులు అప్రమత్తంగా ఉండాలి కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితవ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ఈయన.. త్వరలోనే తన తండ్రి దర్శకత్వంలో నటుడుగా ఇండస్ట్రీకి అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదగాల్సిన అమితవ్ ఇప్పుడు ఇలా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడి వైరల్ అవ్వడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.