Andhra Pradesh: ఏపీలో నిన్న దారుణ ఘటన చోటుచేసుకుంది.. అయితే పార్వతీపురం మన్యం జిల్లాలో మంగళవారం ఉదయం ఒక గర్భిణికి ఎదురైన అనుభవం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రియ పాత్ర అనే మహిళ బరంపూర్ నుండి సూరత్ వెళ్తున్న ‘అమృత్ భారత్ ఎక్స్ప్రెస్’లో ప్రయాణిస్తుండగా, ఒక్కసారిగా ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. రైలు ప్రయాణంలో ఉండగానే నొప్పులు తీవ్రం కావడంతో తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
అయితే పరిస్థితిని గమనించిన రైల్వే సిబ్బంది, తక్షణమే స్పందించి బెలగాం స్టేషన్ వద్ద రైలును అత్యవసరంగా నిలిపివేశారు. ఆ గర్భిణిని సురక్షితంగా కిందకు దించేందుకు కుటుంబ సభ్యులు, తోటి మహిళా ప్రయాణికులు సహకరించారు. రైలు దిగి ఆసుపత్రికి వెళ్లే క్రమంలో రైలు పట్టాలను దాటుతుండగా, ఆమెకు నొప్పులు మరింత ఎక్కువయ్యాయి.
సమయం మించిపోతుండటంతో, వేరే దారి లేక రైలు పట్టాల పక్కనే ఆమె ప్రసవించాల్సి వచ్చింది. తోటి మహిళల సహకారంతో ఆమె అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. నిండు గర్భిణిగా రైలు దిగిన ఆమె, పట్టాలపైనే ప్రసవించడం అక్కడ ఉన్న వారందరినీ ఒకింత ఆందోళనకు, మరికొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read: సంక్రాంతి వేళ గోదావరి జిల్లాలో కోడిపందాల జోరు.. లక్షల్లో బెట్టింగులు
అలాగే ప్రసవం అనంతరం స్థానికులు, బంధువులు కలిసి తల్లిని, పసిబిడ్డను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సకాలంలో స్పందించిన తోటి ప్రయాణికులను, స్థానికులను అందరూ అభినందిస్తున్నారు.