ఏపీలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకుదెరువు కోసం పక్క రాష్ట్రాలు, ఊర్లకు వెళ్లినవారంతా పండక్కి తిరిగి రావడంతో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇక సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాల్లో కోడి పందెలు, బరులు కనిపిస్తాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా స్థానిక లీడర్ల సాయంతో పందెం బరులను భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు సంక్రాంతి పండగను ఏపీ ప్రజలు ఘనంగా జరుపుకుంటుంటారు. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలని పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది. ఓవైపు ప్రజలంతా పండుగ సంతోషంలో ఉంటే ప్రతిపక్ష వైసీపీ మాత్రం కొత్త రాజకీయాలకు తెరలేపింది.
ఈసారి భోగి పండుగ వేడుకల్లో వైసీపీ కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కూటమి ప్రభుత్వంపై విషప్రచారం మొదలెట్టింది. నిన్న రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భోగి మంటల కార్యక్రమాలు జరుగుతుంటే.. చంద్రబాబు దుష్ట ఆలోచనలు ఈ భోగి మంటల్లో కాలి బూడిదవ్వాలని కొందరు వ్యాఖ్యానించడంపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతున్నది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి సర్కార్ నాశనం చేస్తున్నదని పలువురు వైసీపీ మాజీ మంత్రులు, కీలక నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న నగరి మాజీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. జగనన్న చేసిన అభివృద్ధిని చంద్రబాబు చెరిపేస్తూ ఆయనకు పేరు రాకుండా చేస్తున్నారని.. త్వరలోనే తమ ప్రభుత్వం వస్తుందని.. జగనన్న సీఎం అవుతారని ఆమె జోస్యం చెప్పడం గమనార్హం.
రాష్ట్రంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో మెడికల్ కాలేజీలను నిర్వహించనున్నట్టు కూటమి సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అధినాయకత్వం పిలుపు అన్ని జిల్లాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, వైసీపీ కీలక నేతలు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించేందుకు కుదుర్చుకున్న ఒప్పంద ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. ఈ చర్యలను కూటమి సర్కార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది.జగన్ పిచ్చికి ఇది పరాకాష్ట అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు. అయితే, ఒప్పంద ప్రతులను దహనం చేస్తూనే చంద్రబాబు ఈఏడాదైనా దేవుడు మంచి బుద్దిని ప్రసాదించాలని, ఆయన దుష్టరాజకీయాలు నశించాలని భోగి మంటల్లో ప్రతులు వేయడం స్థానికంగా తీవ్ర చర్చ కు దారితీసింది.
Bhogi Pallu: పిల్లలపై భోగి పళ్లు ఎందుకు పోస్తారు? ఈ ఆచారం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని అడ్డుకుంటున్నదని వైసీపీ నేతల ప్రధాన ఆరోపణ. చంద్రబాబు ఏం చేయలేదని వారు విమర్శలు చేస్తున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి చంద్రబాబు నిర్వరామంగా విశ్రాంతి లేకుండా ఏపీ అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని.. తన వయసును కూడా లెక్క చేయకుండా నిత్యం పర్యటనలు చేస్తూ అన్ని శాఖల మీద సమీక్షలు చేస్తూ ప్రగతిపథంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తుంటే వైసీపీ నేతలు చెత్త రాజకీయాలు చేస్తున్నారని కూటమి నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు కృషి లేకపోతే సిక్స్ గ్యారెంటీస్ అమలు, పెట్టుబడుల వెల్లువ, రాజధాని శరవేగంగా నిర్మాణం, పొలవరం నిర్మాణ పనులు, పెండింగ్ ప్రాజెక్టులు, డెవలప్మెంట్ వర్క్స్ ఎలా పరుగులు పెడుతున్నాయని తెలుగు తమ్ముళ్లు కౌంటర్ అటాక్స్ చేస్తున్నారు.