Karate Kalyani:చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ గత కొంతకాలంగా తరచూ వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన మరొకసారి హిందూ దేవుళ్ళ పై చేసిన వ్యాఖ్యల కారణంగా మళ్లీ ఇబ్బందుల్లో పడ్డారు.దాంతో ఆయనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవల స్పందించి వివరణ కూడా ఇచ్చారు ప్రకాష్ రాజ్. అయినా సరే ఆయనపై ఇంకా ఫిర్యాదులు నమోదవుతుండడం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా హిందూ ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ ప్రముఖ నటి, భారతీయ జనతా పార్టీ నాయకురాలు కరాటే కళ్యాణి ప్రకాష్ రాజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కరాటే కళ్యాణి అధికారికంగా ప్రకాష్ రాజ్ పై ఫిర్యాదు దాఖలు చేశారు. కేరళలో జరిగిన ఒక సాహిత్య వేడుకలో రామాయణాన్ని, శ్రీరాముడిని కించపరిచేలా వ్యవహరించారని, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగించారని తక్షణమే ప్రకాష్ రాజ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
ఇకపోతే ప్రకాష్ రాజ్ ఈ అంశంపై రెండు రోజుల క్రితమే వివరణ ఇచ్చారు. తాను ఎవరిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేయలేదని , మూల పురుషుడు శ్రీరాముడిని తాను ఏ రకంగా కూడా కించపరచలేదని వివరణ ఇచ్చారు. కానీ కొంతమంది తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని , త్వరలోనే మళ్లీ వచ్చి అన్నింటికీ సమాధానం చెబుతానని ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు ఆయనపై ఫిర్యాదులు అందడంతో ఈ విషయం చర్చకు దారి తీసింది.
అసలు విషయంలోకి వెళితే.. ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. రామలక్ష్మణులు ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వలస కూలీలని , రావణుడు అనే గిరిజన భూస్వామి తోటలో పండ్లు దొంగలించారని , ఆ వివాదంలో తలెత్తిన చిన్న గొడవ వల్లే రామాయణ యుద్ధం జరిగిందని అర్థం వచ్చేలా ప్రకాష్ రాజ్ మాట్లాడడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.
ALSO READ:ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ప్రశాంత్ నీళ్ డ్రాగన్ మూవీ రిలీజ్ డేట్ లాక్!
చారిత్రక, ఆధ్యాత్మిక వాస్తవాలను వక్రీకరించడం ద్వారా ప్రకాష్ రాజ్ సమాజానికి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని కరాటే కళ్యాణి విమర్శించింది..ముఖ్యంగా నిర్దిగంత అనే నాటక సంస్థ ద్వారా చిన్న పిల్లల చేత హిందూ వ్యతిరేక నాటకాలు వేయిస్తున్నారని , పసిపిల్లల మనసుల్లో మతపరమైన విద్వేషాలను నింపుతూ వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా పోలీసులకు సమర్పిస్తూ భారత న్యాయ సంహిత, భారత సాంకేతిక చట్టం కింద ప్రకాష్ రాజ్ పై కేసుల నమోదు చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వివాదాస్పద వీడియోలను కూడా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.