Keerthy Suresh: కీర్తి సురేష్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాలనటిగా తన సినీ కెరియర్ ప్రారంభించిన ఈమె అనంతరం హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరుస సినిమాల ద్వారా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. తెలుగులో నేను శైలజ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కీర్తి సురేష్(Keerthy Suresh) మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ బిజీ అయ్యారు. ఇక త్వరలోనే కీర్తి సురేష్ రివాల్వర్ రీటా (Revolver Rita)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా నవంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ తన కెరియర్ గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. కీర్తి సురేష్ సినీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది మహానటి సినిమా(Mahanati Movie) అని చెప్పాలి. దివంగత సీనియర్ నటి సావిత్రి బయోపిక్ (Savitri Biopic)సినిమాగా మహానటి సినిమా 2018 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ తన అద్భుతమైన నటనను కనబరిచారు. అచ్చం సావిత్రి లాగే ఈమె హావభావాలను పలికిస్తూ ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో కీర్తి సురేష్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు(National Award) కూడా లభించిన సంగతి తెలిసిందే. ఇలా నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత కీర్తి సురేష్ కు అవకాశాలకు కొదువు ఉండదని అందరూ భావించారు కానీ మహానటి తర్వాత కీర్తి సురేష్ కి సినిమా అవకాశాలే రాలేదని ఈమె తాజాగా వెల్లడించడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఆరు నెలలు ఖాళీగా ..
రివాల్వర్ రీటా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కీర్తి సురేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. మహానటి సినిమా తర్వాత దాదాపు ఆరు నెలల పాటు తనకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదని, ఏ ఒక్కరు కూడా తనకు కథ చెప్పడానికి ముందుకు రాలేదని ఈమె తెలియజేశారు. మహానటి సినిమా చేసి నేను తప్పు చేయలేదు కాబట్టి సినిమాలు విషయంలో నేనైతే ఎలాంటి నిరాశ వ్యక్తం చేయలేదని, మహానటి తర్వాత నాకంటూ ప్రత్యేకమైన పాత్రలను రూపొందించడానికి గ్యాప్ తీసుకున్నారేమో అని పాజిటివ్ గానే భావించానని తెలిపారు.ఇలా మహానటి సినిమా తర్వాత ఆరు నెలలు గ్యాప్ రావడంతో నేను కూడా నా మేకోవర్ పై దృష్టి సారించానని ఈ సందర్భంగా కీర్తి సురేష్ తెలియజేశారు. ఏది ఏమైనా మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కు అవకాశాలు రాలేదని తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.