Mrunal Thakur: సీరియల్ హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించి, నెమ్మది నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది మృణాల్ ఠాగూర్. సీతారామం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మృణాల్ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. సీత పాత్రలో మృణాల్ ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేని విధంగా ఆమె నటన ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఆ ఒక్క సినిమా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మృణాల్ ను సీతగా మార్చేసింది.
తెలుగు ప్రేక్షకులు ఆమెను ఎంతగా ఓన్ చేసుకున్నారు అంటే సీతారామం తర్వాత మృణాల్ గ్లామర్ చూపించే విధంగా డ్రెస్ వేసుకున్నా కూడా నెటిజన్స్ ఆమెపై ఫైర్ అయ్యారు. సీత పాత్ర చేసిన ఆమె గ్లామర్ పాత్రలు చేయకూడదని, అలాంటి డ్రెస్సులు వేసుకోకూడదని చెప్పుకొచ్చారు. ఇక అది కేవలం పాత్ర మాత్రమేనని, కేవలం సినిమాను సినిమాలానే చూడాలని చెప్పిన మృణాల్ ఆ తర్వాత తనకు నచ్చిన పాత్రలను ఎంచుకుంటూ.. మంచి మంచి సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. తెలుగులో హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలతో మెప్పించిన మృణాల్ ప్రస్తుతం అరడజన్ సినిమాలతో బిజీగా మారింది.
సాధారణంగా హీరోయిన్స్ మొదట ఒక ఇండస్ట్రీలో స్టార్ గా నెగ్గి ఆ తర్వాత మరో ఇండస్ట్రీపై యుద్ధం ప్రకటిస్తారు. కానీ, మృణాల్ మాత్రం రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తుంది. ఒకపక్క తెలుగులో హీరోయిన్ గా చేస్తూనే ఇంకోపక్క హిందీలో కూడా వరుస సినిమాలను అంగీకరిస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ప్రస్తుతం మృణాల్ చేతిలో నాలుగు హిందీ సినిమాలు.. రెండు తెలుగు సినిమాలు ఉన్నాయి. అది కూడా అల్లాటప్ప సినిమాలు కాదు అని చెప్పొచ్చు.
హిందీలో ప్రస్తుతం మృణాల్.. అజయ్ దేవగన్ సరసన సన్నాఫ్ సర్దార్ 2 చిత్రంలో నటిస్తుంది. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ ,సలోని జంటగా నటించిన మర్యాదరామన్న సినిమాకు రీమేక్ గా సన్నాఫ్ సర్దార్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక తెలుగులో మర్యాద రామన్న సీక్వెల్ రాలేదు గానీ హిందీలో మాత్రం అజయ్ దేవగన్ సన్నాఫ్ సర్దార్ సీక్వెల్ ను ప్రకటించాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తర్వాత హిందీలో ఆమె హై జవానీతో ఇష్క్ హోనా హై, తుమ్ హోతో, పూజ మేరీ జాన్ ఈ మూడు సినిమాలలో నటిస్తుంది.
ఇక తెలుగు విషయానికి వస్తే ఫ్యామిలీ స్టార్ కొద్దిగా అభిమానులను నిరాశపరిచింది. అయినా కూడా ఎక్కడా తగ్గని మృణాలు డెకాయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మొదట శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. కొన్ని కారణాల వలన శృతి సినిమా నుంచి తప్పుకోవడంతో.. ఆ ప్లేస్ మృణాల్ కు వచ్చింది. ఈ సినిమా డిసెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కాకుండా అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మృణాల్ కూడా ఒక హీరోయిన్ గా ఎంపికయ్యింది.
దీపికా పదుకొనే, బన్నీ సరసన నటిస్తుండగా.. మృణాల్ సెకండ్ హీరోయిన్ గా చేస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా రెండు పడవల మీద ప్రయాణం సేఫ్ గా ఉన్నంతవరకు బావుంటుంది కానీ, ఒక్కసారి బ్యాలెన్స్ తప్పితే మాత్రం అటు బాలీవుడ్ కు.. ఇటు టాలీవుడ్ కు కాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆచితూచి అడుగులు వేయమని నెటిజన్స్ , మృణాల్ కు సలహాలు ఇస్తున్నారు. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.