Nari Nari Naduma Murari: తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా మొదలైన రోజు నుంచి విడుదలయ్యే వరకూ హీరోలు, దర్శకులు.. నిర్మాతలు ఎన్నో నమ్మకాలను పాటిస్తుంటారు. వాటిలో పండుగ సీజన్ రిలీజ్ ఒక ముఖ్యమైన అంశం. తాజాగా హీరో శర్వానంద్ స్వయంగా ఈ సెంటిమెంట్ గురించి మాట్లాడడం ఆసక్తిగా మారింది.
శర్వానంద్ నటించిన తాజా చిత్రం నారి నారి నడుమ మురారి సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైంది. విడుదలైన మొదటి రోజునుంచే.. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే వినోదాత్మక చిత్రంగా ఇది నిలిచింది. సినిమా మంచి స్పందన పొందడంతో యూనిట్ విజయోత్సవ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో మాట్లాడిన శర్వానంద్, సంక్రాంతి సీజన్ తనకు ఎప్పుడూ కలిసి వస్తుందని తెలిపారు.
తన కెరీర్లో సంక్రాంతికి విడుదలైన సినిమాలన్నీ మంచి ఫలితాలు సాధించాయని, వాటితో పాటు రిలీజ్ అయిన ఇతర సినిమాలు కూడా హిట్ అయ్యాయని ఆయన చెప్పారు. ఉదాహరణగా ఎక్స్ప్రెస్ రాజా..శతమానం భవతి, అలాగే తాజా నారి నారి నడుమ మురారి సినిమాలను ప్రస్తావించారు. ఈ కారణంగానే ప్రతి ఏడాది తన కోసం ఒక సంక్రాంతి రిలీజ్ స్లాట్ కేటాయించాలని దర్శకులు, నిర్మాతలను కోరినట్లు చెప్పారు.
అంతేకాదు, వచ్చే సంక్రాంతికి శ్రీను వైట్ల దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు శర్వానంద్.. స్పష్టం చేశారు.
అయితే బాక్సాఫీస్ పరంగా చూస్తే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ లాంటి వారి కామెడీ ప్రధాన బలంగా నిలిచింది. అయినప్పటికీ సంక్రాంతి పోటీ ఎక్కువగా ఉండటంతో సినిమా కలెక్షన్లపై ప్రభావం పడిందని అంటున్నారు.
ఈ సంక్రాంతికి నిర్మాత దిల్ రాజు మూడు సినిమాలను విడుదల చేయడంతో, స్క్రీన్ల కేటాయింపులో నారి నారి నడుమ మురారి సినిమాకు కొంత ఇబ్బంది ఎదురైంది. ఒకవేళ ఈ సినిమా సంక్రాంతి కాకుండా జనవరి చివర్లో, రిపబ్లిక్ డే వీకెండ్కు సోలోగా విడుదలై ఉంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు వచ్చేవని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మొత్తం పైన. శర్వానంద్కు సంక్రాంతి సెంటిమెంట్ కలిసి వచ్చిందనే భావన ఉన్నా, బాక్సాఫీస్ దృష్ట్యా మాత్రం అదే రిలీజ్ డేట్ ఈ సినిమాకు కొంత నష్టాన్ని తీసుకొచ్చిందనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది.
Also Read: NTR -Neel: ఎన్టీఆర్ – నీల్ మూవీలో బాలీవుడ్ నటుడు.