Ranam @20 years:టాలీవుడ్లో విలన్గా మెప్పించి, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక మాస్ ఇమేజ్ను సొంతం చేసుకున్న నటుడు గోపీచంద్. ఆయన కెరీర్ను మలుపు తిప్పిన చిత్రాల్లో ‘రణం’ అత్యంత కీలకమైనది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ‘తొలివలపు’ ప్లాప్ తర్వాత విలన్గా మారి, మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడానికి గోపీచంద్ పడ్డ తపనకు ఈ సినిమా ఒక నిలువెత్తు సాక్ష్యం. నేడు ఈ సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో, గోపీచంద్ మళ్ళీ అలాంటి సక్సెస్ ట్రాక్లోకి ఎప్పుడు వస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ చిత్రాలతో విలన్గా భీభత్సం సృష్టించిన గోపీచంద్, ‘యజ్ఞం’తో హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆ తర్వాత ‘ఆంధ్రుడు’తో పర్వాలేదనిపించినా, ఆయనలోని మాస్ యాంగిల్ను పూర్తిస్థాయిలో ఆవిష్కరించింది మాత్రం ‘రణం’ చిత్రమే. కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, ‘ఈతరం ఫిలిమ్స్’ బ్యానర్ పై పోకిరి బాబురావు నిర్మించిన ఈ చిత్రం 2006 ఫిబ్రవరి 10న విడుదలైంది. ఫిబ్రవరి వంటి అన్-సీజన్లో విడుదలైనప్పటికీ, తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురిపించింది. గోపీచంద్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీ ద్వారా పరిచయమైన అమ్మ రాజశేఖర్ ఆ తర్వాత పెద్ద దర్శకుడిగా ఎదిగారు. ఈ చిత్రంలో కామ్నా జఠ్మలానీ హీరోయిన్ గా నటించగా, మణిశర్మ అందించిన సంగీతం చార్ట్బస్టర్గా నిలిచింది.
‘రణం’ సినిమా కేవలం హిట్ మాత్రమే కాదు, అది ఒక కమర్షియల్ సంచలనం. ఆ రోజుల్లోనే ఈ సినిమా 24 సెంటర్స్ లో 100 రోజులు ప్రదర్శితమై గోపీచంద్ స్టామినాను నిరూపించింది. జూన్ 4న జరిగిన ఈ చిత్ర శతదినోత్సవ వేడుకకు దర్శకరత్న దాసరి నారాయణరావు మరియు విక్టరీ వెంకటేష్ అతిధులుగా విచ్చేసి గోపీచంద్ను అభినందించారు. ముఖ్యంగా ఆ చిత్రంలోని పాటలు, నేపథ్య సంగీతం సినిమా విజయానికి పెద్ద ఎత్తున తోడ్పడ్డాయి. ఈ సినిమాతో గోపీచంద్ మాస్ ఆడియన్స్కు మరింత దగ్గరై, టాలీవుడ్లో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు.
also read:The RajaSaab: ప్రభాస్ మూవీ దెబ్బ.. ఇండస్ట్రీకి దూరం కానున్న మాళవిక.. ఫోటో వైరల్!
ఒకప్పుడు వరుసగా ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’ గోలీమార్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న గోపీచంద్, గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలు మెప్పిస్తున్నా, బాక్సాఫీస్ వద్ద అవి భారీ వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. ‘రణం’ వంటి అవుట్ అండ్ అవుట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ పడితే గోపీచంద్ మళ్ళీ ఫామ్లోకి రావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 20 ఏళ్ల జ్ఞాపకాలు గోపీచంద్కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి, భవిష్యత్తులో ఆయన మళ్ళీ అద్భుతమైన హిట్స్ అందుకోవాలని అభిమానులు మనసారా కోరుకుంటున్నారు.