Samantha : సినీ తారలపై అభిమానాన్ని చాటుకోవడం ఒక ఎత్తయితే.. ఆ అభిమానం హద్దులు దాటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టడం మరో ఎత్తు. ఇటీవల కాలంలో హీరోయిన్ల పట్ల అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. మొన్న నిధి అగర్వాల్కు జరిగిన చేదు అనుభవం మరువక ముందే, టాలీవుడ్ క్వీన్ సమంతకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, ఆ సంఘటనపై సామ్ స్పందించిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏం జరిగింది?
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని శారీస్ షోరూమ్ ప్రారంభోత్సవానికి సమంత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామ్ను చూడటానికి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ముగించుకుని ఆమె బయటకు వస్తున్న సమయంలో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. సెల్ఫీల కోసం జనం ఆమెపై ఎగబడటంతో తీవ్రమైన తోపులాట జరిగింది. బాడీగార్డ్స్ ఎంతో కష్టపడి ఆమెను కారు వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంత గందరగోళం జరిగినా, ముఖంపై చిరునవ్వు చెదరకుండా సమంత అక్కడి నుంచి వెళ్లడం అందరినీ ఆకట్టుకుంది.
సమంత రియాక్షన్
సాధారణంగా ఇలాంటి ఘటనల తర్వాత సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటాం. కానీ సమంత మాత్రం చాలా మెచ్యూర్డ్గా స్పందించారు.అభిమానులు దగ్గరకు వస్తే పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లు కేవలం ప్రేమతో, ఆనందంతో ఒక ఫోటో కోసమో, హాయ్ చెప్పడానికో వస్తారు. వారిలో చాలామందికి ఎలాంటి చెడు ఉద్దేశాలు ఉండవు. ఆ ప్రేమను మనం గౌరవించాలని సమంత పేర్కొన్నారు. అయితే, జనసమూహం ఎక్కువగా ఉన్నప్పుడు తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని, నిర్వాహకులతో పాటు భద్రతా సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని ఆమె సూచించారు. అభిమానులు కూడా కాస్త సంయమనం పాటిస్తే అందరికీ మంచిదని హితవు పలికారు.
బంగారం అంటూ ప్రశంసలు
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనను ఇబ్బంది పెట్టిన వారిని కూడా వెనకేసుకొస్తూ, వారి ప్రేమను తప్పుబట్టొద్దు అని చెప్పడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. సామ్ నువ్వు నిజంగా బంగారం అంటూ అభిమానులు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కేవలం నటిగానే కాదు, మనిషిగా కూడా తనది ఎంత గొప్ప మనసో సమంత మరోసారి నిరూపించుకుంది.