ఇటీవల నటుడు శివాజీ సోషల్ మీడియాలో దుస్తుల సంస్కృతిపై చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. శివాజీ వ్యాఖ్యలపై కొందరు సోషల్ మీడియా వేదికగా మా దుస్తులు మా ఇష్టం అంటూ కౌంటర్ ఇస్తుండగా.. తాజాగా మాజీ సర్పంచ్ నవ్య ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్న వారిపై, చిత్ర పరిశ్రమపై నిప్పులు చెరిగారు.
మనుషులకు, పశువులకు తేడా లేదా?
దుస్తుల విషయంలో మా ఇష్టం అని వాదిస్తున్న వారిపై నవ్య తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ‘పశువులకు విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టే అవి బట్టలు కట్టుకోవు. కానీ మనం కడుపుకు అన్నం తింటున్న మనుషులం.. మనుషుల్లాగే ఒళ్లు దాచుకునేలా బట్టలు కప్పుకోవాలి. బట్టలు అనేవి గౌరవప్రదంగా కప్పుకోవడానికి ఉండాలి కానీ.. విప్పుకోవడానికి కాదు’ అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. కొందరు అర్థనగ్న ప్రదర్శనలు చేయడం వల్ల సమాజంలో పద్ధతిగా ఉండే మహిళలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పాశ్చాత్య సంస్కృతిపై ఆగ్రహం
నిక్కర్లు, జబ్బలు కనిపించేలా అరకొర దుస్తులు ధరించడం ఎక్కడి సంస్కృతి అని నవ్య ప్రశ్నించారు. పాశ్చాత్య దేశాల అలవాట్లను గుడ్డిగా అనుసరిస్తూ భారతీయ సంస్కృతిని బ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యంగా సినిమా నిర్మాతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘అడ్డమైన పాశ్చాత్య సంస్కృతిని తీసుకొచ్చి సినిమాల్లో మహిళలను సగం బట్టలతో ఎందుకు చూపిస్తున్నారు? కేవలం డబ్బు సంపాదన కోసమే మహిళల గౌరవాన్ని తాకట్టు పెడతారా?’ అని నిలదీశారు.
నాటి నటీమణులే ఆదర్శం
సినీ ఇండస్ట్రీలో మారుతున్న పోకడలను నవ్య తప్పుబట్టారు. గతంలో సావిత్రి, జమున వంటి మహానటీలు నిండుగా చీరలు కట్టుకుని నటించలేదా..? వారు నటించిన సినిమాలు అఖండ విజయాలు సాధించలేదా..? అని ఆమె గుర్తు చేశారు. అప్పట్లో నటనకు ప్రాధాన్యత ఉండేదని.. కానీ ఇప్పుడు కేవలం డ్రెసింగ్ కు ప్రాముఖ్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి సినిమాల ప్రభావం వల్ల చిన్న పిల్లలు చెడిపోతున్నారని.. సమాజం పెడదోవ పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రులు తలదించుకునేలా చేయొద్దు..
మా ఇష్టం అని మాట్లాడుతున్న వారికి కనీసం సిగ్గుండాలని నవ్య సంచలన విమర్శలు చేశారు. ‘మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా..? ఆడపిల్లగా పుట్టినందుకు తల్లిదండ్రులు సమాజంలో తలదించుకునేలా ప్రవర్తించకండి’ అంటూ హితవు పలికారు. భారతీయ నారీమణులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని.. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని ఆమె కోరారు. శివాజీ చెప్పిన అంశాల్లో వాస్తవం ఉందని, సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు.