Sankranti Big Releases: టాలీవుడ్లో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలంటే ప్రస్తుతం.. సినిమా కంటే ముందే టికెట్ ధరల చర్చ మొదలవుతోంది. సినిమా విడుదలకు కొన్ని రోజులు మాత్రమే ఉండగానే టికెట్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా స్పష్టత ఉండటం లేదు. ఈ ఆలస్యం ఇప్పుడు ప్రతి పెద్ద సినిమాకి సాధారణ సమస్యగా మారిపోయింది. ప్రేక్షకులు..అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే… నిర్మాతలు మాత్రం చివరి నిమిషం వరకు అనుమతుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
పెద్ద బడ్జెట్ సినిమా అనగానే అభిమానుల్లో ఆనందం, హడావిడి కనిపించాలి. కానీ ఇప్పుడు కోర్టులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టికెట్ ధరలు పెంచుకోవడం, స్పెషల్ షోలు వేయడం కోసం నిర్మాతలు తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నారు. ఈ కన్ఫ్యూషన్ వల్ల సినిమా రిలీజ్ రోజున షోలు పడతాయా లేదా ..అన్న సందేహం కూడా ఉంటుంది. దీని ప్రభావం మొదటి రోజు కలెక్షన్లపై కూడా విపరీతంగా పడుతోంది.
ప్రస్తుతం సంక్రాంతికి రాబోతున్న రెండు పెద్ద సినిమాల విషయంలో ఇదే పరిస్థితి కనిపించింది. ఒకటి ప్రభాస్ హీరోగా వస్తున్న The Raja Saab.. కాగా మరొకటి..మెగాస్టార్ Chiranjeevi నటిస్తున్న మనా శంకర వరప్రసాద గారు సినిమా. ఈ రెండు సినిమాల నిర్మాతలు కూడా టికెట్ ధరలు..ప్రీమియర్ షోలు అనుమతుల కోసం చివరి నిమిషం వరకు ఎదురు చూశారు. ఇది కొత్త సమస్య కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇదే తంతు కొనసాగుతోంది.
ప్రతి సినిమాకి విడివిడిగా అనుమతులు తీసుకోవడం కన్నా..శాశ్వత విధానం అవసరం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధరలు మాత్రం పాత విధానంలోనే ఉన్నాయి. అందుకే ప్రభుత్వం, సినిమా పరిశ్రమ కలిసి కూర్చొని ఒక స్పష్టమైన పాలసీ తీసుకురావాలి. సినిమా బడ్జెట్..స్థాయిని బట్టి టికెట్ ధరలు నిర్ణయించే విధానం ఉంటే చివరి నిమిషం టెన్షన్ తగ్గుతుంది.
ఇటీవల ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ పెరగడంతో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి సమయంలో టికెట్ ధరల గొడవలు ఇంకా ఎక్కువైతే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడం మరింత తగ్గే ప్రమాదం ఉంది. అందుకే ప్రేక్షకులకు భారం కాకుండా, నిర్మాతలకు నష్టం లేకుండా ఉండే మధ్యమార్గం కనుగొనడం ఇప్పుడు టాలీవుడ్ ముందున్న పెద్ద సవాలు అని చెప్పవచ్చు.
ALSO READ: Jana Nayagan Postponed: జన నాయగన్కు హైకోర్టు నుంచి షాక్.. జనవరి 9 విడుదల లేనట్టే..!