Sidharth Malhotra: నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా తండ్రి సునీల్ మల్హోత్రా కన్నుమూశారు. తన తండ్రి మరణవార్తను సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో భావోద్వేగపూరితమైన నివాళి అర్పించారు. సిద్ధార్థ్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో తన తండ్రికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, ప్రస్తుత ఫోటోలను పంచుకున్నారు. “మీరు నిద్రలోనే ప్రశాంతంగా మమ్మల్ని విడిచి వెళ్లారు. మీరు వదిలి వెళ్లిన లోటు ఎవరూ పూడ్చలేనిది” అని పేర్కొన్నారు. తన తండ్రి అరుదైన నిజాయితీ, సమగ్రత సంస్కారం కలిగిన వ్యక్తి అని సిద్ధార్థ్ కొనియాడారు. “క్రమశిక్షణ ఉన్నా కఠినంగా ఉండేవారు కాదు. అహంకారం లేని శక్తి ఆయనది. జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా ఆయన ఎప్పుడూ సానుకూలతను కోల్పోలేదు” అని రాశారు.
ఏం చేసేవారంటే?
సునీల్ మల్హోత్రా గతంలో మర్చంట్ నేవీ కెప్టెన్గా పనిచేశారు. అనారోగ్యంతో బాధపడుతూ, పక్షవాతం వల్ల చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ, ఆయన ఎంతో ధైర్యంగా పోరాడారని సిద్ధార్థ్ గుర్తుచేసుకున్నారు. “నా తండ్రి విలువలే నా వారసత్వం. ఆయన చూపిన మార్గమే నన్ను నడిపిస్తుంది. నేను ఎవరో అది నా తండ్రి వల్లే సాధ్యమైంది. మీ పేరును, మీ విలువలను నేను ఎల్లప్పుడూ ముందుకు తీసుకువెళ్తాను” అని సిద్ధార్థ్ తన సందేశంలో తెలిపారు. సిద్ధార్థ్ మల్హోత్రా తన తండ్రికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఈ కష్టసమయంలో సిద్ధార్థ్ కుటుంబానికి అభిమానులు, బాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.