BJP Meeting: స్వేఛ్చ బ్యూరో: దక్షిణాధి రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమావేశాన్ని బీజేపీ హైదరాబాద్లో నిర్వహిస్తోంది. నేడు జరిగే వర్క్ షాప్ (కార్యశాల)కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధానకార్యదర్శి బీఎల్.సంతోష్ తోపాటు, బీజేపీ జాతీయ సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, ఇతర నేతలు పాల్గొననున్నారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు ఉన్న కార్యకర్తలకు ఈ వర్క్ షాప్ లో శిక్షణ ఇచ్చి, ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఈ సందర్భంగా బీఎల్ సంతోష్, శివప్రకాశ్ పార్టీ కార్యకర్తలకు మార్గదర్శనం చేయనున్నారు.
పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క షాప్ప్లో బీజేపీ నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. భారతీయ జనతా పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ ప్రక్రియ పూర్తయ్యాక నిర్వహించే సంఘటన పర్స్లో భాగంగానే కార్యకర్తలకు సంస్థాగతంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయి కార్యశాలను నిర్వహించారు. రాష్ట్ర స్థాయి కార్యశాల అనంతరం జిల్లాల వారీగా, మండల స్థాయిలో ఈ శిక్షణ కార్యశాలలను బీజేపీ నిర్వహించబోతుంది.
సంస్థాగత అంశాలకు సంబంధించి విస్తృతంగా చర్చించి, అన్ని మండలాల్లో పెద్దఎత్తున ఈ కార్యశాలలను నిర్వహించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలపర్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో జరిగిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన అధికార దుర్వినియోగం, కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) చేసిన ధన ప్రవాహం, అరచకాలను భవిష్యత్తులో సమర్థంగా ఎదుర్కొనేలా కార్యాచరణతో ముందుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగానే పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.