Sobhita Dhulipala : అందాల భామ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన ఈ వైజాగ్ చిన్నది.. ఇటీవలే అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అయితే, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి గ్లామర్ ప్రపంచంలో కథానాయికగా ఎదగడం వెనుక శోభిత పడ్డ శ్రమ సామాన్యమైనదేమీ కాదు.
వద్దన్న తల్లిదండ్రులు
సినిమా రంగంతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం శోభితది. తండ్రి మర్చంట్ నేవీలో రిటైర్డ్ అధికారి, తల్లి రిటైర్డ్ టీచర్. శోభిత సినిమాల్లోకి వెళ్తానంటే వారు ముందుగా ఎంతో ఆందోళన చెందారట. ఏ బ్యాగ్రౌండ్ లేని చోట, ఎవరూ తెలియని ఇండస్ట్రీలో ఒక అమ్మాయి రాణించడం కష్టమని వారు వారించారు. కానీ, తన ఇష్టాన్ని గెలిపించుకోవడానికి శోభిత ఒంటరిగానే పోరాటం మొదలుపెట్టింది.
మిస్ ఇండియా టైటిల్..
కేవలం 19 ఏళ్ల వయసులోనే 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది శోభిత. అప్పట్లో వైజాగ్ ప్రజలు, మీడియా ఆమెపై చూపిన ఆదరణ మరువలేనిదని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే, అంత చిన్న వయసులో వచ్చిన ఆ పాపులారిటీని ఎలా ఉపయోగించుకోవాలో, దాని ద్వారా ఎలా డబ్బు సంపాదించాలో తనకు తెలియదని ఆమె నిజాయితీగా చెప్పారు. కేవలం పేరు కోసమో, డబ్బు కోసమో తాను ఈ రంగంలోకి రాలేదని, తనలోని నటిని నిరూపించుకోవడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
శేఖర్ కమ్ముల అంటే ఇష్టం
చాలామంది హీరోయిన్లలాగా శోభిత చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరగలేదు. పుస్తకాలు చదవడం, నాట్యం చేయడం అంటే ప్రాణమని శోభిత తెలిపారు. సాంస్కృతిక విషయాలపై ఉన్న ఆసక్తితోనే ఆమె తనను తాను మలుచుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. తనకు ఇష్టమైన సినిమాల గురించి చెబుతూ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఆనంద్’ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. సంగీతం నేర్చుకోవాలనే కోరిక కూడా తనలో బలంగా ఉందని ఆమె వెల్లడించారు.
మోడలింగ్ నుంచి యాక్టింగ్ వైపు అడుగులు వేయడం శోభిత జీవితంలో అతిపెద్ద మలుపు. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా, కేవలం స్వయంకృషితో, పట్టుదలతో ఈ స్థాయికి చేరుకుంది శోభిత. వివాహం తర్వాత కూడా ఆమె తన కెరీర్ను బ్యాలెన్స్ చేస్తున్న తీరును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు..