Sonam Kapoor: బాలీవుడ్ నటి సోనమ్ కపూర్, ఆమె బిలియనీర్ భర్త ఆనంద్ అహుజా లండన్లో కొనుగోలు చేసిన లగ్జరీ విల్లా ఇప్పుడు అక్కడ ఒక పెద్ద వివాదానికి దారితీసింది. లండన్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నోటింగ్ హిల్’ ప్రాంతంలో 21 మిలియన్లు (సుమారు రూ. 220 కోట్లు) వెచ్చించి వీరు ఒక పాత భవనాన్ని కొనుగోలు చేశారు. 200 ఏళ్ల నాటి ఈ పురాతన భవనాన్ని పూర్తిగా ఆధునీకరించి, బేసమెంట్లో స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్టులను నిర్మించేందుకు ఈ దంపతులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Read also-తండ్రి హత్యకు కొడుకు తీర్చుకున్న పగ… ఓటీటీలోకి ఇంటెన్సివ్ హిందీ క్రైమ్ డ్రామా
అయితే, ఈ విల్లా పక్కనే ఉన్న ‘హిల్క్రెస్ట్’ అనే అపార్ట్మెంట్ బ్లాక్లో సోనమ్ దంపతులకు చెందిన ఒక కంపెనీ మరో ఐదు ఫ్లాట్లను రూ. 42 కోట్లకు కొనుగోలు చేయడంతో అసలు వివాదం మొదలైంది. ఈ ఫ్లాట్లను వారు తమ విల్లాలో పనిచేసే ‘పనివారి క్వార్టర్స్’ గా మార్చడానికి వాడుతున్నారని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, అపార్ట్మెంట్ గ్యారేజీని కూడా కొనుగోలు చేసి, వారి లగ్జరీ కార్ల కలెక్షన్ను ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ‘డైలీ మెయిల్’ పత్రికతో పేర్కొన్నారు.
ఈ కొనుగోళ్ల ద్వారా అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ బోర్డుపై ఒత్తిడి తెచ్చి, తమకు నచ్చిన విధంగా భవన నిర్మాణ మార్పులకు అనుమతులు పొందే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఈ విషయంపై తాము నిరసన వ్యక్తం చేస్తే, ఆ ఫ్లాట్లను పేదలకు ఇచ్చే ‘సోషల్ హౌసింగ్’ కోసం కేటాయిస్తామని సదరు కంపెనీ ప్రతినిధులు తమ్ము బెదిరించారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు బిలియనీర్లు తమ ప్రశాంతమైన కమ్యూనిటీని ఆటస్థలంగా మారుస్తున్నారని, ఇప్పటికే కొందరు యజమానులు ఈ దంపతులకు లీగల్ నోటీసులు కూడా పంపారని తెలిపారు.
Read also-ACB Probe: రంగారెడ్డి హెల్త్ ఆఫీసుపై ఏసీబీ కన్ను.. సీక్రెట్ నిఘా పెట్టిన టీమ్..!
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “అసలైన ఈస్ట్ ఇండియా కంపెనీ బాకీలు వసూలు చేయడానికి బ్రిటన్ వచ్చింది” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. విదేశీయులు ఇలా ఇష్టమొచ్చినట్లు ఇళ్లను కొంటూ స్థానికులకు ఇళ్ల కొరత సృష్టిస్తున్నారని, సోనమ్ దంపతులను బ్రిటన్ నుండి బహిష్కరించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే, అది వారి సొంత ఇల్లని, ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని మరికొందరు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.